కోనసీమ కొబ్బరి చెట్ల గురించి తెలంగాణ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారని, కోనసీమకు దిష్టి తగిలిందని, కోనసీమ ప్రాంతం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందేమో అని తనకు అనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.
తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్వకుంట్ల కవిత తదితరులు డిమాండ్ చేశారు. అయితే, రైతులతో ముచ్చటిస్తున్న సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తున్నారని జనసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
ఆ వ్యవహారం సద్దుమణిగిన తరుణంలో తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట పెను శాపం అని కేసీఆర్ అన్నారు. కొంతమందికి ఇది నచ్చదని కూడా ఆయన చెప్పారు. దీంతో, కేసీఆర్ పై జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు పవన్ ఫ్లో లో అన్న మాటలపై బీఆర్ఎస్ నేతలు నానా యాగీ చేశారని, మరి, ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట పెను శాపం అంటూ నేరుగా కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్టేట్మెంట్ ఇచ్చేశారని విమర్శిస్తున్నారు.
ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఏపీ అని, ఆ రకంగా చూసుకుంటే తెలంగాణ ఏర్పాటు ఏపీకి పెనుశాపం అని ఆంధ్రా నాయకులు భావించాలని గుర్తు చేస్తున్నారు.
కానీ, ఏ నాడూ ఏపీ నాయకులు అలా అనలేదని చెబుతున్నారు. వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్ మహా నగరాన్ని తెలంగాణకు వదిలేసి, పునాదుల నుంచి అమరావతి రాజధానిని నిర్మించుకుంటూ కష్టపడుతోంది ఏపీ అని, తెలంగాణ కాదని, అటువంటప్పుడు తెలంగాణకు ఏపీ పెనుశాపం ఏవిధంగా మారిందని ప్రశ్నిస్తున్నారు.
“ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే… తెలంగాణ పాలిట శాపం.”– #KCR pic.twitter.com/SUhQd0mmg4— Gulte (@GulteOfficial) December 21, 2025