ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందన్న నమ్మకం తనకు ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. జరిగిన అతిపెద్ద పోరాటం ఏదైనా ఉంటే.. అది అమరావతి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటమేనని చెప్పారు. తాజాగా అమరావతిలోని విట్విశ్వవిద్యాలయం లో జరిగిన 5వ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్డీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
అమరావతి కోసం..
ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను తదుపరివచ్చే ప్రభుత్వాలు కొనసాగించకపోతే.. ఏం జరుగుతుందన్నది గత ఎన్నికల్లో చూశామని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అమరావతిని పక్కన పెట్టడం సరికాదన్న విషయాన్ని ప్రజలు అంగీకరించారన్నారు. అమరావతి రైతులు తమకు వారసత్వంగా వచ్చిన భూములను రాజధాని కోసం ఇచ్చారని.. దీనిని నిలిపివేయడంతో వారికి ఆదరవు లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలోనే వారు సుదీర్ఘ పోరాటం చేశారని చెప్పారు. దీనిని దేశం మొత్తం అంగీకరించిందన్నారు.
అయితే.. ఈ క్రమంలో రైతులు చేసిన న్యాయపోరాటానికి చట్టం పరిధిలో అండగా నిలిచిన న్యాయవాదులు.. న్యాయమూర్తులకు కూడా నిర్బంధాలు , వేధింపులు తప్పలేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆనాడు అనేక మంది న్యాయమూర్తులు అమరావతి రైతులకు అనుకూలంగా వ్యాఖ్యానించినందుకు.. బదిలీ అయ్యారని, అనేక మంది వేధింపులకు సోషల్ మీడియాలో ట్రోల్స్కు కూడా గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వినియోగించిన కారణంగానే.. ఇలా జరిగిందన్నారు. ఆ విధంగా ప్రతీకార రాజకీయాలు చేయడాన్ని ప్రజలు హర్షించలేదని చెప్పారు.
ఎన్ని నిర్బంధాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా.. రైతులు రాజధాని కోసం చేసిన ఉద్యమం.. పట్టుదలతో ముందుకు సాగి న వైనం.. చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వారికి పేరు పేరునా తాను నమస్కరిస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కృత్రిమ మేథ(ఏఐ) కన్నా.. మానవ మేధస్సు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఏఐని నమ్ముకుని ఉద్యోగాలను తీసేస్తున్న సమస్యలు.. 95 శాతం వరకు నష్టం పోతున్నాయన్నారు. మానవ మేథస్సును మించిన వ్యవస్థ ఏదీలేదన్నారు. అవసరం మేరకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక, మీడియా ఏకపక్ష ధోరణులను కూడా జస్టిస్ ఎన్వీ రమణ తప్పుబట్టారు.