గుజరాత్లో తొలిసారి బీజేపీ సర్కారు మధ్యంతరంగా సంపూర్ణ మంత్రి వర్గ ప్రక్షాళన చేసింది. గతంలో మంత్రులను ఒకరిద్దరిని మార్చిన సంస్కృతి ఉంది. అదేసమయంలో సంపూర్ణంగా ముఖ్యమంత్రితో పాటు అందరినీ మార్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ, తొలిసారి ముఖ్యమంత్రిని అలానే ఉంచి.. కేవలం పూర్తిగా మంత్రులను తీసేయడం.. వారి స్థానంలో కొత్తవారిని నియమించడం.. సరికొత్తగా ఎన్నికైన వారికి.. వివిధ రంగాలకు చెందిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం.. చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రిబావా జడేజాకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈమె కీలకమైన జామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీలో గత నాలుగేళ్ల కిందటి నుంచే పనిచేస్తున్న ఆమెకు.. గత ఎన్నికల్లో అవకాశం చిక్కింది. తాజాగా జరిగిన మంత్రివర్గ మార్పులో రిబావాకు అవకాశం ఇచ్చారు. ఇక, సీఎం భూపేంద్ర పటేల్ను మాత్రం బీజేపీ అధిష్టానం మార్పు చేయకుండా.. కొనసాగించింది. గతంలో 16 మంది మంత్రులు ఉన్నారు.
వారందరినీ ఏకబిగిన ఒకేసారి రాజీనామా చేయించారు. తాజాగా 25 మందిని ఎంపిక చేసి.. వారికి మంత్రి పదవులు ఇచ్చారు. వీరిలో తాజాగా రాజీనామా చేసిన వారి నుంచి ఆరుగురిని మాత్రం తిరిగి మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. గవర్నర్ దేవవ్రత్ కొత్త వారితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇక, హర్ష్ రమేష్ సంఘ్వి.. ఉప ముఖ్యమంత్రిగా పోస్టు దక్కించుకున్నారు. అయితే.. నిన్నటి వరకు కొనసాగిన మంత్రి వర్గంలో ఈయన హోం శాఖ మంత్రిగా ఉన్నారు. సూరత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎందుకింత మార్పు?
సాధారణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రి వర్గమార్పు పెద్దగా ఉండదు. పైగా.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ అసలు మార్పు దిశగా ఎవరూ ప్రయత్నం కూడా చేయరు. అలాంటిది ఎందుకు మార్చారంటే.. పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే(ఇదే ఏపీలో ఎన్నికలకు ముందు వివాదం అయింది)లో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో స్థానిక ఎన్నికలకు కూడా రంగం రెడీ అయింది. దీనికి తోడు డ్రగ్స్, మద్యం అక్రమరవాణా పెరిగిపోయాయి. దీనివెనుక మంత్రులు ప్రమేయం ఉందన్న వాదనా వినిపించింది. దీంతో సీఎంను జాగ్రత్త పెట్టుకుని మిగిలిన వారిని మార్చేశారు.