తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పెద్ద టెస్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20 నెలలకు పైగా సాగుతున్న `ఇందిరమ్మ` పాలనలో ప్రజలకు ఎన్నో మేళ్లు చేశామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రధాన పరీక్ష పెడుతోందన్న వాదన పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. అయితే.. ఎన్నికలన్నాక.. గెలుపు-ఓటమి సహజం. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనే విషయాలు ప్రజల భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది.
పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సెంటిమెంటుతో కూడికున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుస్తుందా? ఓడుతుందా? అనే విషయం కూడా ఎవరినాడికీ అందడం లేదు. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం.. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డికి ఇదొక లిట్మస్ టెస్టు అనే అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని భావించే పరిస్థితి ఉన్నా.. వచ్చే ఓటు బ్యాంకును బట్టి ప్రభుత్వ పనితీరులో మరింత మెరుగుపడాల్సిన సందేశాన్ని ప్రజలు ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు.. ప్రజలు ఎక్కడ ఏమేరకు తేడా చూపించారన్న విషయాన్ని అంచనా వేసుకుని దానిని సరిచేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడుతుంది. ముఖ్యం గా సీఎం రేవంత్ రెడ్డి మార్పుల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక, ఏదైనా తేడా వచ్చి పరాజయం పాలైనా.. ప్రభుత్వ పనితీరు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరింతగాజాగ్రత్తలు తీసుకోవడంతోపాటు.. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకో వాల్సిన పరిస్థితి ఉంటుంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు దాదాపు ఇక ఎన్నికలకు అవకాశం లేనందున(స్థానికం మినహా) ఈ ఉప ఎన్నిక ప్రభుత్వానికి.. ఒక అవకాశంగా మారనుందని పరిశీలకులు చెబుతున్నారు. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు ఉప పోరు లిట్మస్ టెస్టు వంటిదేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటిని పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఆయన మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.