ఏపీ సీఎం చంద్రబాబు కలలను విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు సాకారం చేయనుందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెట్టుబడుల వేటలో సుదీర్ఘంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్లు ఇప్పటికే దుబాయ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, లండన్ సహా పలు దేశాల్లో పర్యటించారు. మొత్తంగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 16 మాసాల్లో మొత్తం 10 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు రాబట్టారు.
ఇక, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న విశాఖ పెట్టుబడుల సదస్సు మరింతగా ఈ పెట్టుబడులకు ఊపు తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా పెట్టుబడుల కల్పనకు కూడా గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక, ఈ సదస్సులో కనీసంలో కనీసం.. మరో 10 లక్షల కోట్ల రూపాయల వరకు అదనంగా పెట్టుబడులు సాధించే అవకాశం ఉందని సర్కారు అంచనా వేస్తోంది. ఏయే రంగాలు కీలకంగా ఉన్నాయి? ఏయే రంగాల్లో పెట్టుబడులు వస్తాయి? అనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రభుత్వ అంచనాలు ఇవీ..
పెట్టుబడుల సదస్సుకు 45 దేశాల నుంచి 300 పారిశ్రామికవేత్తలు వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొనే అవకాశం ఉందని లెక్కలు కట్టారు. మొత్తంగా ఆయా కంపెనీలు, సంస్థలతో 410 ఎంవోయూలను కుదుర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. వీటి ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు.. మరో 7.5 లక్షల ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా ఉంది.
ఇక, గత 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు కూడా విశాఖ వేదికగా.. తమ ఆవిష్కరణలకు సంబంధించిన కీలక ప్రకటన చేయడంతోపాటు.. ఒప్పందాలు కూడా చేసుకోవడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.
అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ద్వారా రూ.1.5లక్షల కోట్లు
గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటుతో 15 బిలియన్ డాలర్లు
నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం.
ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.25 లక్షల కోట్ల రూపాయలతో హరిత ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు.
టీసీఎస్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యుపవర్ వంటి భారీ కంపెనీలు కూడా రానున్నాయి.
జిల్లాల వారీగా పెట్టుబడులు..
అనంతపురం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రాక.
కర్నూలులో పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాల ఏర్పాటు.
ప్రకాశం జిల్లాలో సీబీజీ ఏర్పాటు.
నెల్లూరులో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్
అమరావతిలో క్యాంటమ్ కంప్యూటింగ్ జనవరిలో ఏర్పాటు కానుంది.
ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ పరిశ్రమల ఏర్పాటు.
ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైస్(వైద్య పరికరాలు), స్టీల్ సిటీ, డేటా సిటీల ఏర్పాటు.