తిరుపతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మారబోతోందని అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇకపై క్వాంటం వేగంతో అమరావతి అభివృద్ధికి నాంది పలుకుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్వాంటం వ్యాలీ శంకుస్థాపనతో చారిత్రాత్మక ఘట్టం ప్రారంభమైందన్నారు. రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా మిగిలి పోతుందన్నారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధాని గానే కాకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా రూపాంతరం చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైఎండ్ రీసెర్చ్లో ఏపీ దేశానికే మార్గదర్శకం కానుందని అన్నారు.
నవ్యాంధ్ర యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, అవకాశాలు, పరిశోధన వేదికలు భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. క్వాంటం అమరావతి గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో అభివృద్ధి దిశగా ముందడుగుతో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల వాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలల రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలో భవిష్యత్ ప్రపంచ టెక్నాలజీకి అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కానుందన్నారు. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. హైటెక్ సిటీతో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన విజనరీ నాయకత్వంలో, క్వాంటం వ్యాలీతో నవ్యాంధ్ర సరికొత్త చరిత్రను లిఖించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
The post గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా అమరావతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా అమరావతి
Categories: