ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సోమవారం ఉదయం ఫోన్ చేశారు. ప్రస్తుతం మొంథా తుఫాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలు ప్రభావితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సోమవారం మధ్యాహ్నం వరకు తుఫాను దోబూచులాడుతూనే ఉండడం గమనార్హం. అయితే.. సోమవారం రాత్రి నుంచి తుఫాను ప్రభావం పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అధికారులను రంగంలోకి దించారు.
ఈ నేపథ్యంలో ఊహించని విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చింది. సోమవారం(ఈరోజు) ఉదయం 12 గంటల సమయంలో ఫోన్ చేసిన ప్రధాని.. మొంథా తుఫాను ప్రభావం సహా.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి సాయం కావాలన్నా.. కేంద్రం నుంచి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సంప్రదించవచ్చని.. అధికారులు అందుబాటులో ఉంటారని ప్రధాని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మొంథా తుఫాను, చేపడుతున్న చర్యలపై చంద్రబాబు మోడీకి వివరించారు. కాగా.. 2015-16మధ్య కూడా తితిలీ తుఫాను వచ్చినప్పుడు.. ప్రధాని ఇదే విధంగా స్పందించారు. అయితే.. అప్పటికి ఇప్పటికి ఎన్డీయే కూటమిలో ఏర్పడిన అనుబంధం నేపథ్యంలో ప్రధాన మంత్రి మరింత చొరవ తీసుకోవడం గమనార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి ఈ రోజు ఉదయమే చేరుకున్న ముఖ్యమంత్రి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించారు. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా అధ్యయనం చేయాలని.. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. ‘‘ప్రతి గంటకూ తుపాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.“ అని ఆయన పేర్కొన్నారు.