తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విషయంలో తనకు సమయం కావాలంటూ.. స్పీకర్ ప్రసాదరావు.. కొన్ని రోజుల కిందట .. సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై మరోసారి విచారణ జరిగింది. అయితే.. ఎందుకింత సాగదీస్తున్నారన్న ప్రశ్న సుప్రీంకోర్టు నుంచి వచ్చింది.
దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు కొన్ని కారణాలు చెప్పారు. దీనికి సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. మరో 4 వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇదే ఆఖరని.. ఇకపై సమయం ఇవ్వబోమని స్పష్టం చేసినట్టు బీఆర్ ఎస్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ నాలుగు వారాల్లో సదరు జంపింగులపై చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. కోర్టుకు కూడా వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పీకర్కు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. మరో నాలుగు వారాలు సమయం రావడంతో ఇప్పుడు స్పీకర్ ప్రసాదరావు సహా ప్రభుత్వానికి కూడా పెద్ద ఊరట లభించినట్టు అయింది. స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సదరు జంపింగులపై అనర్హత వేటు పడితే.. ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందే. ఈ నేపథ్యంలో ఉన్న సమయంలోనే వారితో రాజీనామాలు చేయించి.. తిరిగి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారు. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా.. బీఆర్ఎస్ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే.. వీరిని పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఈ క్రమంలోనే స్పీకర్కు గడువు విధిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఆయన వివిధ కారణాలతో రెండు మాసాల సమయం కోరగా.. తాజాగా 4 వారాల గడువు మాత్రమే సుప్రీం ఇచ్చింది. ఇదిలావుంటే.. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. ఆయన ధిక్కరణ చర్యలు తీసుకోవాలని బీఆర్ ఎస్ కోరింది. కానీ, కోర్టు దీనికి సమ్మతించలేదు.