సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని కూడా సూచిస్తాయి. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూటమిలోని మిత్రపక్షం జనసేన ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు బహిరంగ వేదికగానే ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే పనితీరును ఆయన మెచ్చుకున్నారు.
తాజాగా నాయుడుపేటలో పార్టీకార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు.. నాయకుల పనితీరు ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఇదేసమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ప్రశంసలు గుప్పించారు. ఆయన పనితీరును కొనియాడారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆరణి వైసీపీలో ఉన్నారు. అయితే..టికెట్పై సందేహాలు రావడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. నిజానికి ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు. అనారోగ్య కారణాలతో తనబాధ్యతలను తన సోదరుల కుమారులకు అప్పగించారు. అయితే.. పార్టీ అధినేత కానీ.. సీఎం చంద్రబాబుకానీ.. నియోజకవర్గానికి వచ్చినప్పుడు యాక్టివ్గా వారితో కలిసి వేదిక పంచుకుంటున్నారు. ఈ విషయాన్నే చంద్రబాబు ప్రస్తావించారు. పేరు చెప్పకుండానే.. జనసేన ఎమ్మెల్యే బాగా వ్యవహరిస్తున్నారు అని కితాబు ఇచ్చారు.
దీనికి కారణం.. కూడా చంద్రబాబు చెప్పారు. “నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారా? లేదా? అనేది నేను చెప్పను. కానీ.. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు గుర్తిస్తున్నారు. కార్యకర్తల కష్టాలు తెలుసుకుని వారికి సాయం అందిస్తున్నారు. ఇది ఆయనకే కాకుండా.. పార్టీకి కూడా మేలు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే కొన్ని కొన్ని సార్లు ఓటర్లను నిర్ణయించలేవు. మన ప్రవర్తన కూడా నిర్ణయిస్తుంది. ఇలాంటి ప్రవర్తనలో జనసేన ఎమ్మెల్యే తీరు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటివి అలవరుచుకోవాలి.“ అని చంద్రబాబు సూచించారు.