స్టార్ హీరోల కొడుకులు వచ్చినంత వేగంగా కూతుళ్లు మేకప్ వేసుకుని తెరమీదకు రారనేది నగ్న సత్యం. శృతి హాసన్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపులా నిలుస్తారు కానీ, బాలీవుడ్ ఖాన్లు కపూర్ల కుటుంబాల నుంచి హీరోయిన్లు వచ్చినంత ఫాస్ట్ గా మన దక్షిణాదిలో ఉండదు. కానీ ఇప్పుడీ ట్రెండ్ క్రమంగా మారేలా ఉంది. మహేష్ బాబు మేనకోడలు, ఆయన అక్క మంజుల కూతురు జాన్వీ ఘట్టమనేని ఎంట్రీలకి రంగం సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కొన్ని కీలకమైన విషయాలు ఆసక్తి గొలిపేలా అనిపిస్తాయి.
90 దశకంలో సూపర్ స్టార్ కృష్ణ తన కూతురు మంజులని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నించారు. ఆమెకూ ఆసక్తి ఉండటంతో దానికి సంబంధించి ప్రయత్నాలు జరిగాయి. బాలకృష్ణ టాప్ హీరోలో జోడిగా మంజులనే అడిగారని అప్పటి పత్రికల్లో వచ్చింది. అయితే కృష్ణ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. గ్లామర్ ఫీల్డ్ కి అమ్మాయిని దూరంగా ఉంచమని కోరడంతో కృష్ణ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ తర్వాత మంజుల షో లాంటి ఒకటి రెండు సినిమాలు చేసి, దర్శకత్వం ట్రై చేసి, ఆ తర్వాత పోకిరితో ప్రొడ్యూసర్ గా మారి కొంత కాలం బిజీ అయ్యారు. భర్త సంజయ్ స్వరూప్ రెగ్యులర్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తారు.
ఇప్పుడు జాన్వీ ఘట్టమనేనికి రంగం సిద్ధం కావడం చూస్తుంటే అమ్మ నెరవేర్చుకోలేని లక్ష్యం ఇప్పుడు కూతురు రూపంలో తీర్చుకోబోతున్నారన్న మాట. అయితే అప్పటిలా పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి అభిమానులు నో అనే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ రమేష్ బాబు కూతురు భారతి కూడా ఎంట్రీ ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఓ నాలుగైదేళ్ల తర్వాత మహేష్ తనయురాలు సితార కూడా తెరమీద కనిపించినా ఆశ్చర్యం లేదు. మహేష్ బాబు, సుధీర్ బాబు ల తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి జయకృష్ణ, చరిత్, దర్శన్, గౌతమ్ ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్ రంగప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.