జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ 24 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోక ముందే.. బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు.. పుండుపై కారం చల్లినట్టుగా బీఆర్ ఎస్కు మరింత కాకపుట్టిస్తున్నాయి. బీఆర్ ఎస్ ఓటమిపై కవిత తాజాగా స్పందిస్తూ.. `కర్మ హిట్స్ బ్యాక్` అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఆమె ఏ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్య చేశారన్నది చెప్పలేదు.
కానీ, ప్రస్తుతం కొన్నాళ్లుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. బీఆర్ ఎస్ గురించే కావడం..ఈ ఉప పోరులో ఆ పార్టీ తీవ్రంగా పరాజయం పాలవడంతో కవిత వ్యాఖ్యలు బీఆర్ ఎస్ గురించేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. `కర్మ హిట్స్ బ్యాక్`(చేసిన కర్మ(అది పాపం కావొచ్చు) తిరిగి చుట్టుకుంది అని అర్థం) అంటూ కవిత వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి సునీత విజయం దక్కించుకుంటారని.. ఆమెకు సెంటిమెంటు(మహిళ+భర్తను కోల్పోయిన పరిస్థితి) కలిసి వస్తుందని అంచనావేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆమె పరాజయం పాలయ్యారు.
ఈ ఉప పోరులో సునీతకు 74259 ఓట్లు మాత్రమే పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. ఆయనకు 98988 ఓట్లు వచ్చాయి. అంటే.. ఇద్దరి మధ్య 24729 ఓట్ల తేడా ఉంది. దీంతో బీఆర్ ఎస్ శిబిరం ఆవేదనలో మునిగిందన్నది వాస్తవం. మరోవైపు ఆ పార్టీ కీలకనాయకుడు కేటీఆర్ స్పందించారు. తాము ధైర్యంగా ఉన్నామని.. గెలుపు, ఓటములను సమానంగా తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ఈ ఓటమిపై పార్టీ అధినేతకేసీఆర్ స్పందించాల్సి ఉంది. మరోవైపు.. కవిత మాత్రం.. `కర్మ హిట్స్ బ్యాక్` అని కామెంట్లు చేయడంతో బీఆర్ ఎస్ వర్గం రగిలిపోతుండడం గమనార్హం.
Karma hits back !!! — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025