వైసిపి అధినేత జగన్ ఇటీవల డిజిటల్ బుక్ పేరుతో ఒక యాప్ను తీసుకువచ్చారు. వైసీపీ సమస్యలు, నాయకుల పై నమోదవుతున్న కేసులు, వారి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలను కూడా ఈ యాప్లో నమోదు చేయాలని ఆయన పార్టీ కేడర్కు సూచించారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, వాస్తవానికి ఒక యాప్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని కానీ ఒక యాప్ ద్వారానే నాయకులపై ఒత్తిళ్లు తగ్గుతాయని గాని అనుకోలేము.
గతంలో టిడిపి కూడా ఇలానే డిజిటల్ యాప్ను తీసుకొచ్చింది. పార్టీ నాయకుల పై నమోదైన కేసులను అందులో నమోదు చేయాలని పేర్కొంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. వారి సమస్యలు విన్నారు. వారు చెప్పింది విని పరిష్కారం కూడా చూపించారు.
కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వైసీపీలో డిజిటల్ బుక్ పెట్టాము కాబట్టి ఇక ఎవరూ పార్టీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని, ఏదైనా ఉంటే డిజిటల్ బుక్ ద్వారా నమోదు చేసుకుంటే సీఎం చూస్తారని తాడేపల్లిలో కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు పార్టీ ఆఫీసుకు వచ్చారు. అయితే మీ సమస్యలు ఏంటి అని అడగాల్సిన వారే “డిజిటల్ బుక్లో నమోదు చేశారా? లేదా చెయ్యకపోతే నమోదు చేయండి చాలు” అని ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. దీంతో వచ్చిన నాయకులు వెనుతిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇక అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ బుక్ పెట్టడం తప్పు కాదు. కానీ తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించాలని వారి వాదన.
కానీ ఆది నుంచి కూడా ఒకరు చెప్పింది వినే లక్షణం లేకపోవడంతో నాయకులు తీవ్ర మదనం చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ పుంజుకోవడం కష్టం అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎన్ని యాప్లు ఉన్నా ముఖాముఖి నాయకుడితో మాట్లాడితే కలిగే సంతృప్తి కార్యకర్తలకు కానీ ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోవడంలో వైసిపి నాయకులు మరోసారి వెనకబడ్డారని చెప్పాలి.
మరి ఈ సమస్యని ఇలాగే ఉంచుతారా? లేక పరిష్కరిస్తారా? అనేది చూడాలి. డిజిటల్ బుక్ ఒకటే ప్రామాణికమైతే అన్ని పార్టీలు ఏదో ఒక యాప్ను తీసుకువచ్చి కార్యకర్తలను దూరం పెట్టే పరిస్థితి ఉండేది. కానీ అలా చేయడం వల్ల పరిస్థితులు సర్దుమణగమని, కార్యకర్తల్లో సంతృప్తి రాదని అన్ని పార్టీలు గమనించబట్టే నాయకులకు, కార్యకర్తలకు సమయం కేటాయించే పరిస్థితి ఉంది.
ఈ దిశగా వైసిపి ఆలోచన చేయాలి. ముఖ్యంగా జగన్ అందుబాటులోకి రావాలి అనేది పార్టీ నాయకులు కోరుతున్న మాట. మరి ఏం చేస్తారనేది చూడాలి.