విశాఖపట్నంలో త్వలోనే గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు కానుంది. గూగుల్ భాగస్వామ్య సంస్థ రైడెన్ తో కలిసి.. ఈ డేటా కేంద్రం.. అదేవిధంగా ఏఐ హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న వాదన ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. మెల్బోర్న్లో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు పారిశ్రామిక వేత్తలను ఏపీకి ఆహ్వానించారు.
వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖ కేంద్రంగా నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని మంత్రి కోరారు. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక, కేవలం 24-48 గంటల్లోనే అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించామని వివరించారు. మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉన్న విద్య, వైద్యం, లాజిస్టిక్స్ రంగాలు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగానే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానుందని వివరించారు. అయితే.. దీనివెనుక చాలా కష్టం ఉందన్నారు. 13 నెలల పాటు తాను అవిశ్రాంతంగా దీనిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. అనేక సార్లు ఈ విషయంపై ఆలోచించి నైట్ ఔట్లు కూడా చేసినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆసియా దేశాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమన్న విషయం తెలిసిందేనని నారా లోకేష్.. పారిశ్రామిక వేత్తలకు చెప్పారు.
ఆస్ట్రేలియాలో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి.. విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. “మీరు పెట్టుబడి పెడితే.. దానిని మా బిడ్డలా చూసుకుంటాం.“ అని మంత్రి వివరించారు. పెట్టుబడి మీది భద్రత, భరోసా మాది.. అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.