ఒకపక్క కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ పాజిటివ్ టాక్ వెల్లువలా సోషల్ మీడియాని ముంచెత్తుతున్నప్పటికీ ఓజి మేనియా దాన్ని తట్టుకుని నిలబడుతోంది. దసరా పండగని క్యాష్ చేసుకునే పనిలో ఉన్న ఓజస్ గంభీర ఇప్పటిదాకా సుమారు రెండు వందల అరవై కోట్ల గ్రాస్ దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాడు. 2025 హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న సంక్రాంతికి వస్తున్నాంని అఫీషియల్ గా దాటేందుకు పరుగులు పెడుతున్నాడు. బుక్ మై షోలో గంటకు ఇప్పటికీ పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే పవన్ సునామి బాగానే వెళ్తోందని అర్థమవుతోంది. ముఖ్యంగా నైజాం వసూళ్లు భారీగా ఉన్నాయి.
ఏపీలో పది రోజుల పాటు పెంచిన టికెట్ ధరలే కొనసాగించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకోవడంతో దాని ప్రభావం ఆక్యుపెన్సీల మీద పడుతోంది. మెయిన్ సెంటర్స్ లో పవన్ క్రేజ్ పుణ్యమాని చెల్లిపోతోంది కానీ బిసి కేంద్రాల్లో హౌస్ ఫుల్స్ ఆలస్యంగా జరుగుతున్నాయి లేదా మొత్తం సోల్డ్ అవుట్ చేయలేకపోతున్నాయి. ఒకవేళ తెలంగాణ తరహాలో ప్రభుత్వం అనుమతించిన రెగ్యులర్ గరిష్ట ధరలే అమలులో ఉంటే ఓజి రన్ ఇంకా బలంగా ఉండేదని ట్రేడ్ టాక్. అయితే పెట్టుబడి కోణంలో చూసుకుంటే వేగంగా రికవర్ కావాలంటే పండగ టైంలో పెంపులు ఉంచేయక తప్పదు. అందుకే దాన్ని కంటిన్యు చేస్తున్నారు.
వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి ఓజి అంత సులభంగా డ్రాప్ అవ్వకపోవచ్చు. ఒకసారైనా చూడొచ్చనే అభిప్రాయం కామన్ ఆడియన్స్ లో రావడంతో ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి. అయితే కాంతార చాప్టర్ 1 ప్రభావం లేదని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఫ్యామిలీ జనాలకు దీని రూపంలో ఇంకో ఛాయస్ దొరికింది. పిల్లలను సెన్సార్ అనుమతించని ఓజి కన్నా కాంతార వైపే వీళ్ళు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఓవర్సీస్ లో అయిదు మిలియన్ మార్క్ దాటేసిన పవన్ నిన్న సక్సెస్ మీట్ లో తన ఆనందాన్ని వివిధ రూపాల్లో పంచుకోవడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.