మనం బాహుబలి ది ఎపిక్, మాస్ జాతర గొడవలో పడిపోయాం కానీ బాలీవుడ్ లో వీటితో పాటు రిలీజైన ది తాజ్ స్టోరీ మీద ఒక వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. కారణం సబ్జెక్టులో ఉన్న కాంట్రవర్సీ. తాజ్ మహల్ షాజహాన్ కట్టలేదని, అంతకు ముందు అదే స్థలంలో ఒక శివాలయం ఉండేదనే వివాదం ఈ మధ్యే తలెత్తింది. చరిత్రకారులు కొందరు ఆధారాలు చూపుతుండగా ఇదంతా అబద్దామంటూ మరో వర్గం కౌంటర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో దీన్నే కథగా రాసుకున్న దర్శకుడు తుషార్ అమ్రీష్ గోయల్ ఈ వివాదాన్ని తన సినిమా ద్వారా చర్చగా మార్చాలని చూశారు. కానీ అనుకున్న ఫలితం వచ్చేలా లేదు.
స్టోరీ అయితే ఇంటరెస్టింగ్ గానే రాసుకున్నారు. ఆగ్రాలో ఉండే విష్ణుదాస్ అనే గైడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజ్ మహల్ ని షాజహాన్ కట్టక ముందే అక్కడో గుడి ఉందని బాంబు పేలుస్తాడు. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసి వ్యవహారం కోర్టు దాకా వెళ్తుంది. ఈలోగా విష్ణు దాస్ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. కొడుకు ఉద్యోగం పోవడమే కాక తన ఉనికి సైతం ప్రమాదంలో పడుతుంది. దీంతో స్వంతంగా పిల్ వేసి తన వాదనను న్యాయస్థానంలో వినిపించాలని విష్ణు దాస్ నిర్ణయించుకుంటాడు. అక్కడ జరిగే ఆర్గుమెంట్లు, చర్చలు వగైరాలే తెర మీద చూడాల్సిన మిగిలిన ది తాజ్ స్టోరీ.
పరేష్ రావల్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేయగా అపోజిషన్ లాయర్ గా నటించిన జాకీర్ హుసేన్ నువ్వా నేనానే రీతిలో లాయర్ పాత్రను రక్తి కట్టించారు. అయితే రెండు గంటల నలభై అయిదు నిమిషాల నిడివిలో అధిక శాతం కోర్ట్ రూమ్ డ్రామాగా నడవడం, సంభాషణలు బాగున్నప్పటికీ అవి సుదీర్ఘంగా ఉండటం వల్ల ఈ టాపిక్ మీద విపరీతమైన ఆసక్తి ఉన్నవాళ్లకు తప్ప ది తాజ్ స్టోరీ రెగ్యులర్ ఆడియన్స్ కి బోర్ కొట్టే ఆవకాశమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి మల్టీప్లెక్సుల్లో జనాలు ఓ మోస్తరుగా చూస్తున్నారు కానీ ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం వీక్ గానే ఉంది. కమర్షియల్ కోణంలో తాజ్ స్టోరీ ఫెయిల్యూర్ గా నిలవొచ్చు.