ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. శనివారం తిరుపతిలో పర్యటించారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలోని మామండూరులో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అటవి తల్లి బాట కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా మామండూరులో దీనికి శ్రీకారం చుట్టారు.
మామండూరు అటవీ ప్రాంతం ఒకప్పుడు దట్టంగా ఉండేది. అయితే.. తర్వాత కాలంలో వృక్షాల చోరీ.. సహా కలప కూడా ఎత్తుకు పోవడంతో ఇక్కడ చెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పవన్ కల్యాణ్.. మామండూరు అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా త్వరలోనే వేలం వేయాలని భావిస్తున్న ఎర్ర చందనం గోడౌన్ను కూడా ఆయన పరిశీలించారు.
మంగళం ప్రాంతంలో ఉన్న ఎర్ర చందనం గోడౌన్లో భారీ ఎత్తున దుంగలు ఉన్నాయి. వీటిని వేలం వేయాల్సి ఉంది. అయితే.. అంతర్జాతీయ పరిణామాలు.. ఇతరత్రా కారణాలతో ఈ వేలం ప్రక్రియ వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అడ్డంకులను అధిగమించి త్వరలోనే దీనిని వేలం వేయాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలో సదరు గోడౌన్లో ఎన్ని దుంగలు ఉన్నాయి.? ఏయే రకాల చందనం ఉంది? అనే విషయాలను పవన్ తెలుసుకున్నారు.
ఆకట్టుకున్న లుక్..
తిరుపతి పర్యటనలో పవన్ కల్యాణ్ కొత్త లుక్లో కనిపించారు. ఆర్మీలోని సీఆర్ పీఎఫ్ వాళ్లు ధరించే ఫ్యాంట్ను వేసుకో వడంతోపాటు.. ఖాకీ రంగు షూ ధరించారు. నీలం రంగు టీషర్టు వేసుకున్నారు. దీంతో పవన్ కొత్త లుక్ సంతరించుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన అభిమానులు .. ఫొటోలను జోరుగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లుక్కు భిన్నంగా తొలిసారి సీఆర్ పీఎఫ్ సిబ్బంది ధరించే లేత ఆకుపచ్చ, దానిపై వివిధ రకాల ఆకులతో ఉన్న ఫ్యాంటు ను ధరించడం విశేషం.