చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్.. 2023లో ‘పఠాన్’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. అది ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. దాని కంటే ముందు షారుఖ్ నటించిన ‘జీరో’ కనీసం వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ‘పఠాన్’ తర్వాత ‘జవాన్’తో వరుసగా రెండో వెయ్యికోట్ల సినిమాను అందించాడు షారుఖ్. కానీ ‘డంకీ’ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టింది. షారుఖ్ను అంత క్లాస్ క్యారెక్టర్లో చూడలేకపోయారు అభిమానులు.
ఐతే ఇప్పుడు కింగ్ ఖాన్.. తన స్టార్ ఇమేజ్కు తగ్గ భారీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. ‘పఠాన్’ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న ‘కింగ్’ మూవీ టీజర్తో ప్రేక్షకులను పలకరించింది. అది చూసిన కింగ్ ఖాన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు.
సిద్దార్థ్ ఆనంద్ అంటే భారీ, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. అందుకు తగ్గట్లే ‘కింగ్’ సినిమాను రూపొందించినట్లున్నాడు. సముద్రం మధ్యలో ఉన్న ఒక భవంతిలో హీరో వందల మందిని మట్టుబెట్టే సన్నివేశం మీద టీజర్ను నడిపించారు. మందస్వరంతో సాగిన షారుఖ్ వాయిస్ ఓవర్ ఈ టీజర్కు హైలైట్. మంచివాళ్లా చెడ్డవాళ్లా అని చూడకుండా తాను ఎంత కిరాతకంగా చంపుతానో వివరిస్తూ.. తన మర్డర్స్ కౌంట్ చెబుతూ.. అనేక దేశాల్లో తానెంత పాపులరో ఇంట్రో ఇచ్చాడు హీరో.
‘ఎ న్యూ షారుఖ్ ఖాన్ ఎక్స్పీరియెన్స్’ అంటూ కింగ్ ఖాన్ను సరికొత్త అవతారంలో సూపర్ స్టైలిష్గా చూపించి ఎగ్జైంట్మెంట్ పెంచాడు సిద్దార్థ్ ఆనంద్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ.. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ‘పఠాన్’ తరహాలోనే ఇది షారుఖ్ అభిమానులను, యాక్షన్ ప్రియులను అమితంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ తనయురాలు సుహానా ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తోంది. షారుఖ్, సిద్దార్థ్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.