hyderabadupdates.com movies ‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

ఏడాది చివర్లో బాక్సాఫీస్ వేటకు వచ్చి, సంచలన వసూళ్లు సాధించిన ‘దురంధర్’ సినిమా.. 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాక ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఐతే విడుదలకు ముందు ఈ సినిమా ఇలాంటి సంచలనం రేపుతుందని ఎవ్వరూ అనుకోలేదు. 

ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఆ మేర వసూళ్లు రాబట్టగలదా అన్న సందేహాలు కలిగాయి. ఎందుకంటే దీని దర్శకుడు ఆదిత్య ధర్‌ది ఒకే ఒక్క సినిమా అనుభవం. హీరో రణ్వీర్ కపూర్ సక్సెస్‌లో లేడు. ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించడం, మూడున్నర గంటలకు పైగా నిడివితో రిలీజ్ చేస్తుండడంతో సినిమా సక్సెస్ మీద సందేహాలు కలిగాయి. 

కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లింది ‘దురంధర్’. మూడో వారాల తర్వాత కూడా దీని జోరు తగ్గడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముంగిట హైప్ పెంచడం కోసం కార్పొరేట్ బుకింగ్స్ పెద్ద ఎత్తున చేయిస్తున్నారని.. టికెట్లు బ్లాక్ చేసి హౌస్ ఫుల్స్ చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తొలి వీకెండ్లో కూడా ఈ ఆరోపణలు కొనసాగాయి. దీనిపై దర్శక నిర్మాత ఆదిత్య ధర్ తాజాగా స్పందించాడు. 

‘‘దురంధర్ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి ప్రతి టికెట్ ఆర్గానిగ్గా కొన్నదే. రిలీజ్ టైంలో కార్పొరేట్ బుకింగ్స్ అంటూ ఏడ్చిన వాళ్లంతా ఇప్పుడు హఠాత్తుగా మౌనం వహిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ‘దురంధర్’ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంపై జనాలకు ఉన్న ప్రేమకు ‘దురంధర్’ నిదర్శనం’’ అని పేర్కొన్నాడు. దురంధర్ వసూళ్లు ప్రస్తుతం రూ.900 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి.

Related Post