వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం!. ఏపీ డిప్యూటీసీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి.. మేలైన సంస్కర ణలను ఆయన అమలు చేస్తున్నారు. ఇప్పటికే జల జీవన్ మిషన్ను పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా .. 15వ ఆర్థిక సంఘం నిధులతో రహదారులను వేయిస్తున్నారు. ఈ పనులు చాలా గ్రామాల్లో పూర్తయ్యాయి. 25 శాతం గ్రామాల్లోనే పెండింగులో ఉన్నాయి. ఇక, ఇప్పుడు `స్వర్ణ పంచాయత్` పేరుతో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలను కూడా గ్రామాల్లో అమలు చేస్తున్నారు. వాస్తవానికి దీనిని కేంద్రం 2021-22 మధ్య తీసుకువచ్చింది. అయితే.. అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. తాజాగా గత ఏడాది చివరి నుంచి దీనిపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం .. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఆ వెంటనే అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. స్వర్ణ పంచాయత్ ను అమలు చేయాల్సిందేనని తీర్మానం చేయించి.. ఆమేరకు చర్యలు కూడా ప్రారంభించారు. దీనివల్ల పంచాయతీల్లో ప్రజలు చెల్లించే ప్రతి రూపాయికీ.. పారదర్శకత ఏర్పడుతుంది. అంతేకాదు.. అవినీతికి అవకాశం కూడా ఉండదు. దీనిని అమలు చేయడం పెద్ద కష్టం కాకపోయినా.. పంచాయతీ కార్యాలయాలకు నెట్ సౌలభ్యం ఏర్పాటు చేయడం సమస్య. దీనిని తాజాగా పవన్ కల్యాణ్ అధిగమించారు.
ఫలతంగా ఇప్పుడు 75 శాతం గ్రామ పంచాయతీలు.. స్వర్ణ పంచాయత్ పరిధిలోకి వచ్చాయి. వీటిని ఆన్లైన్ చేశారు. వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే.. 1) ప్రజలకు తమ ఆస్తులు.. నేరుగా సైట్లలో కనిపిస్తాయి. 2) బిల్లులు చెల్లించాలన్నా.. ఆస్తి పన్నులు కట్టాలన్నా.. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 3) తమకు ఏ అవసరం వచ్చినా.. అధికారుల చుట్టూ తిరగకుండా.. స్వర్ణ పంచాయత్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పత్రాలు ఇంటికే వస్తాయి. రుసుములు కూడా అందులోనే చెల్లించవచ్చు. ఫలితంగా.. ఇప్పుడు సగానికి పైగా ప్రజలు ఆఫీసులకు రావడం మానేశారు. ఈ నిర్ణయం.. తమకు అందివచ్చిన అవకాశం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.