పసిడి.. బంగారం.. స్వర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్కరూ పండుగల సీజన్లో అంతో ఇంతో కొనుగోలు చేయాలని భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు అత్తమామలు.. పుట్టింటివారు కూడా కానుకగా స్వర్ణాభరణాలనే ఇవ్వాలని తలపోస్తారు. ఇక, ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా పసిడి ఆభరణాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది.. తాజాగా పసిడి ధర అమాంతం పైపైకి పెరిగిపోయింది. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర ధరలు దిగి వచ్చినా.. అదేసమయంలో కీలకమైన దసరా, దీపావళి పండుగల సమయంలో సర్ణం ధర సలసలమంటోంది.
ఎందుకిలా..?
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కొలాప్స్ అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏ రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎవరిపై సుంకాలు బాదేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సురక్షి తమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారు. అలాగని భూములపై పెట్టడం లేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో తమ భూములకు రక్షణ లేకుండా పోతోందని ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది ప్రజలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అందరికీ విలువైంది.. అందరూ పెట్టుకునేది బంగారమే. అంతేకాదు.. బంగారంపై పెట్టుబడులు పెడితే.. ప్రభుత్వాలకు కూడా లాభమే. దీనిని గమనించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొనుగోళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు గత దశాబ్ద కాలంగా .. బంగారం ధర పైసా కూడా తగ్గలేదని.. ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అందుకే బంగారం ధరలకు రెక్కలు మొలిచాయని అంటున్నారు.
ఈ రోజు ఎంతెంత?
+ ఏపీ, తెలంగాణల్లో పది గ్రాములు 22 క్యారెంట్ల బంగారం.. 1,08,500(+3% జీఎస్టీ) రూపాయలు
+ ఏపీ, తెలంగాణల్లో పది గ్రాములు 24 క్యారెంట్ల బంగారం.. 1,18,500(+3% జీఎస్టీ) రూపాయలు
+ ఏపీ, తెలంగాణల్లో కిలో వెండి: 1,62,000(+3% జీఎస్టీ) రూపాయలు
కొసమెరుపు: దీపావళి, ధన్తేరస్ చేరువ అయ్యే మరో 20 రోజుల నాటికి పదిగ్రాముల ఆర్నమెంటు బంగారం.. 1,35,000లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.