ఆయన గతంలో కేంద్ర మంత్రి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే. మరి అప్పట్లో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమేరకు దూసుకుపోతున్నారు? ఏమేరకు నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారు? అనేది కీలకం. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 88 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కూడా ఒకరు. ఇక గతంలో కేంద్రంలో చక్రం తిప్పి కేంద్ర మంత్రిగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఒకరు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సూర్యప్రకాశ్ రెడ్డి తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్రానికి జిల్లాకు మేలు చేశానని పదే పదే చెప్పే జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అనేది చూస్తే కొంత నిరాశే కలుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న సీనియార్టీ రాజకీయ అనుభవం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిపదవిని ఆశించారు.
కానీ యువతకు పెద్దపీట వేస్తానని చెప్పిన చంద్రబాబు ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి టీజీ భారత్ కు అవకాశం ఇచ్చారు. ఇక మైనారిటీ కోటాలో ఫరూక్ కు అవకాశం కల్పించారు. ఇది కోట్లను నిరాశకు గురిచేసింది. దీంతో ఎన్నికైన తర్వాత కొంతకాలం బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్రబాబు హెచ్చరికలు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల నేపథ్యంపై బయటకు వచ్చినా అనారోగ్యం వెంటాడుతోంది. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్న కోట్ల పెద్దగా యాక్టివ్ గా లేరన్నది వాస్తవం.
దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సందడి కనిపించడం లేదు. వచ్చినా ఇలా ముఖం చూపించి అలా వెళ్లిపోతున్నారు. ఇది ఎమ్మెల్యే హవాకు ఇబ్బందిగా మారింది. మరోవైపు టీడీపీలోనే వర్గ పోరు కూడా వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు టీడీపీలోనే సీనియర్ నాయకుడు ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ వివాదాలకు దారితీసింది. మొత్తంగా ఇటు రాజకీయాల వ్యవహారం మరోవైపు వయసుతో కూడిన సమస్యల కారణంగా నియోజకవర్గంలో కోట్ల పాలిటిక్స్ కు పాట్లు తప్పడం లేదు.