ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. ఒకే వేదికపై పలు మార్లు కలుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా పక్కపక్కన కూర్చున్నారు. వారి మధ్యలో ఇతర నాయకులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా కర్నూలు పర్యటనలో శ్రీశైలం దేవస్థానానికి విచ్చేసిన ప్రధాన మంత్రి-సీఎం-ఉపముఖ్యమంత్రులు.. దాదాపు ఒకరి పక్కన ఒకరు కూర్చుని చర్చించుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనికి `త్రిమూర్తులు` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి మండపం ఉంది. దీని అరుగుపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అలానే కూర్చున్న ముగ్గరు అధినేతలు.. ఒకరి కొకరు దాదాపు ఎదురుగా కూర్చొన్నట్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ఆలయ విశేషాల గురించి.. సీఎం చంద్రబాబు వివరిస్తున్నట్టుగా.. ప్రధాని ఆసక్తిగా వింటున్నట్టుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది.
ఇక, వారికి పక్కనే.. వారి వైపు తిరిగి అరుగుపై కూర్చున్న పవన్ కల్యాణ్ కూడా వారి సంభాషణను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇలాంటి ఫొటో ఇప్పటి వరకు రాలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక సభల్లో పక్క పక్కన కూర్చున్నా.. ఇలా.. ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకునే సందర్భం.. అందునా.. దేవ స్థానంలోని అరుగుపై.. పొరుగింటి వ్యక్తులు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నట్టుగా ఉండడంతో ఎక్కువ మంది షేర్లు, లైకులు చేస్తుండడం గమనార్హం. మొత్తం కర్నూలు పర్యటనలో ఈ ఫొటో హైలెట్గా నిలవడం గమనార్హం.