ఏపీలో 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా 151 సీట్ట నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫలితంగా అప్పటిదాకా బలీయంగా కనిపించిన వైసీపీ.. అత్యంత బలహీన పార్టీగా గోచరించడం మొదలైంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఏ ఒక్కరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే… పార్టీలో బలమైన కుటుంబంగా కనిపిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఏకంగా పార్టీ నుంచి గెంటేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
వైసీపీ విపక్షంలోకి రాగానే… ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలు వరుసబెట్టి అరెస్టు అవుతున్నారు. అలాంటి వారిలో మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలను కలిసేందుకు జగన్ నేరుగా వారు ఉంటున్న జైళ్లకు వెళ్లారు. ఈ మేరకు ఆయన నిబంధనల మేరకు ములాఖత్ లకు దరఖాస్తు చేసుకుని అనుమతులు సాదించుకుని మరీ కలిశారు. మరి 72 రోజుల పాటు పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని మాత్రం కలవలేదు. అసలు జగన్ అటువైపు చూడలేదంటే అతిశయోక్తి కాదేమో.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వంశీ రిలీజ్ అయిన వెంటనే ఆయన తన ఫ్యామిలీని వెంటేసుకుని మరీ జగన్ ను కలిశారు. జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే మిథున్ జైలు నుంచి విడుదలై ఏకంగా నాలుగు రోజులు అవుతున్నా… జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే కనిపించట్లేదు. రహస్యంగా వారిద్దరూ కలిసి మాట్లాడుకున్నారో, ఏమో తెలియదు గానీ పబ్లిక్ గా అయితే వారిద్దరూ కలిసినట్లు ఓ చిన్న ఫొటో గానీ, ఓ వార్త ముక్క గానీ కనిపించలేదు. అయితే అటు మిథున్ తో పాటు ఆయన తండ్రి కూడా తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ ను వదిలేది లేదని, వైసీపీని వీడేది లేదని, తమ రాజకీయ ప్రయాణం మొత్తం జగన్ తోనే అని అడిగిన వారికి అడగని వారికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు.
ప్రస్తుతం లోక్ సభలో పార్టీ నేతగా కొనసాగుతున్న మిథున్ రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఇక పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డికి తిరుగే లేదు. 2019 తన సోదరుడు ద్వారకానాథ రెడ్డిని రంగంలోకి దించిన రామచంద్రారెడ్డి వరుసగా రెండో సారీ తంబళ్లపల్లె నుంచి గెలిపించుకున్నారు. మొత్తంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతిలో ఓ ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన పెద్దిరెడ్డి ఫ్యామిలీ లాంటి కుటుంబాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వదులుకోదు. అయితే జగన్ మిథున్ ను ఎందుకు దూరం పెడుతున్నారన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. పరిస్థితి చూస్తుంటే… మిథున్ ఎదుగుదలను చూసి జగన్ పెద్దిరెడ్డి ఫ్యామిలీని పార్టీ నుంచి గెంటేయాలని భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.