హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, హైదరాబాద్లోని ఐసీసీసీ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమతో పాటు 124 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగి పోవడం తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిలుపును విశ్వసించి మావోయిస్టులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా, వారికి ఆర్థిక సహాయం, ఇతర వసతులు కల్పిస్తామనే నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను అభినందించారు. మహాత్మా గాంధీ తన శాంతియుత పోరాటంతో ఒక యుద్ధాన్ని జయించిన స్థాయిలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అన్నారు. నేడు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరకు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించు కోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.
The post ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం
Categories: