అమరావతి : కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని బలిగొన్న ప్రేమోన్మాది ఘాతుకంపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు కలిగిన యువతి హత్యకు గురికావడం మనస్సును కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, బాలికలపై పట్ల ఉన్మాదిలా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు. ఈ మేరకు ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ, యువతి ఇంటికి వెళ్లి గొంతు కోయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విచక్షణ మరిచి, ఎంతో భవిష్యత్తు కలిగిన యువతిని బలి కొనడం దారుణమన్నారు ఎస్. సవిత.
నిందితుడు వెంకటేష్ క్షమించరాని నేరం చేశాడన్నారు. ప్రేమోన్మాదికి చట్ట పరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి సవిత, అండగా ఉంటామన్నారు. భవిష్యత్తులో మరెవరూ మహిళలు, బాలికల వైపు కన్నెత్తు చూడకుండా ఉండేలా చట్టపరంగా నిందితుడిని శిక్షిస్తామన్నారు. మహిళల పట్ల సైకోల్లా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజని హెచ్చరించారు. యువత బాధ్యతతో మెలుగుతూ, డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ఎస్. సవిత. మగ బిడ్డల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పుడూ వారిపై ఓ కన్నేసి ఉంచాలని అన్నారు. నైతిక విలువలతో కూడిన జీవనం సాగించేలా చూడాలని మంత్రి సవిత హితవు పలికారు.
The post ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : ఎస్. సవిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : ఎస్. సవిత
Categories: