‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా, వసూళ్ల పరంగా అప్పటికి ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇంత భారీ సినిమాను నిర్మించి, బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాశాక దాన్ని నిర్మించిన సంస్థ నుంచి పెద్ద పెద్ద సినిమాలే ఆశిస్తాం.
కానీ ఆర్క మీడియా వర్క్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఓటీటీలో రిలీజైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిన్న సినిమాతో సరిపెట్టింది. ‘బాహుబలి’ రెండు భాగాలతో భారీ లాభాలు అందుకున్నా.. ప్రొడక్షన్ మీద మంచి పట్టు ఉన్నా సరే.. ఆర్క మీడియా అధినేతలు ప్రొడక్షన్లో యాక్టివ్గా లేరు. ఐతే చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది ఆరంభంలో ఈ సంస్థ రెండు చిత్రాలను అనౌన్స్ చేసింది. అవే ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.
ఈ రెండు చిత్రాల్లోనూ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా చేయాల్సింది. కానీ ఈ సినిమాలు అనౌన్స్మెంట్కే పరిమితం అయ్యాయి. షూట్ మొదలుకాలేదు. వాటి గురించి ఏ అప్డేట్ కూడా లేదు. ఐతే ఎట్టకేలకే ఇందులో ఒక సినిమా చిత్రీకరణను టీం మొదలుపెట్టింది. అదే.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి రూపొందించనున్నాడు. యేలేటి అనే ఇంటి పేరు ఉందంటే.. అతను చంద్రశేఖర్ యేలేటి ఫ్యామిలీ మెంబర్ అయ్యుండొచ్చు.
యేలేటి కుటుంబంతో రాజమౌళి ఫ్యామిలీకి బంధుత్వం ఉందన్న సంగతి తెెలిసిందే. శశాంక్ ఇంతకుముందు ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ అనే టీవీ సిరీస్ చేశాడు. ఫాహద్ను ఒప్పించి తెలుగులో హీరోగా నటింపజేస్తున్నారంటే ఇది స్పెషల్ ఫిలిమే అయ్యుంటుందని భావిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రెజెంట్ చేస్తుండడం, ఆయన తనయుడు కార్తికేయ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుందట.