అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెట్ యార్డులు, రైతు బజార్లు, లింకు రోడ్ల అభివృద్ధి కోసం ఏంఎంసీల ఆదాయం సరిపోక మార్కెట్ సెస్ను వరిపై 1% నుంచి 2%కు, చేపలు/రొయ్యలపై 0.5% నుంచి 1%కు పెంచినట్లు మంత్రి తెలిపారు. అయితే అదనపు ఆదాయాన్ని చూపిస్తూ రూ.1,600 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చి APSWC–CWC మార్గంలో రుణాలు పొందే ప్రయత్నం జరిగిందని అన్నారు. నాబార్డు తిరస్కరించినప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.258.85 కోట్లతో 497 పనులు హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా చేపట్టారని విమర్శించారు. వరిపై సెస్ పెంపుతో సుమారు రూ.371 కోట్లు వసూలు చేసినప్పటికీ వాటి వినియోగంపై స్పష్టత లేదన్నారు.
కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముడవుతున్న పంటలకు వెంటనే జోక్యం చేసుకోవడానికి 2025-26లో రూ.300 కోట్లు కేటాయించగా, అవసరాన్ని బట్టి ఇప్పటికే రూ.588 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పొగాకు రూ.240 కోట్లు, మామిడి రూ.190 కోట్లు, ఉల్లి కొనుగోలు రూ.17.20 కోట్లు, ఉల్లి నష్టపరిహారం రూ.128.33 కోట్లు, కోకో రూ.12 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. 2026-27లో ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరింత ఖర్చు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. మిర్చి ధరలు పతనమైన సందర్భంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద క్వింటాకు రూ.11,781.25 MIP నిర్ణయించడంతో మార్కెట్ ధరలు స్థిరపడ్డాయని తెలిపారు.
2017లో మిర్చి ధరలు పడి పోయినప్పుడు రూ.130 కోట్లు వెచ్చించి 55 వేల రైతులకు క్వింటాకు రూ.1,500 చొప్పున అందించామని గుర్తు చేశారు. గతంలో 2020లో MSP ప్రకటించినప్పటికీ అమలుకు నిధులు ఇవ్వలేదన్నారు. టమాటా ధరలు తగ్గడంతో “నో లాస్–నో ప్రాఫిట్” విధానంలో కొనుగోలు చేసి రైతు బజార్లలో, 8 జిల్లాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా అమ్ముతున్నామని చెప్పారు. ఉల్లి రైతుల కోసం కడప, కర్నూలు జిల్లాల్లో రూ.17.56 కోట్ల కొనుగోలు చేయడంతో పాటు హెక్టారుకు రూ.25 వేల పరిహారాన్ని రూ.50 వేలుగా పెంచి రూ.128.33 కోట్లు చెల్లించామని తెలిపారు.
The post మద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతులకు భరోసా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మద్దతు ధర, ధరల స్థిరీకరణతో రైతులకు భరోసా
Categories: