అమరావతి : తమది స్నేహ పూర్వకమైన ప్రభుత్వమని , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారని అన్నారు. కష్టాలు చెప్పుకోవడానికి అప్పటి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే… మీ ఊరు ఎక్కడుంది? అనే స్థాయి నుంచి, మీ సమస్యలు తెలుసు కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి.
కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే మేం మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మీరు సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాక ముందే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన‘మాటా – మంతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించాం అని తెలిపారు. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక, ఏజెన్సీలో డోలీ మోతలు కనిపించ కూడదని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
The post మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : పవన్ కళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : పవన్ కళ్యాణ్
Categories: