వాయిదాలు పడుతూ వస్తున్న మాస్ జాతర ఎట్టకేలకు విడుదల తేదీ దక్కించుకుంది. అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. అదే రోజు బాహుబలి ఎపిక్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకపోవడంతో ఫైనల్ గా లాక్ చేసుకుంది. అయితే పోస్ట్ పోన్ల పర్వం పెద్ద హీరోలకు మాములే కానీ మాస్ జాతరకు కొన్ని సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. వాటిలో మొదటిది హైప్ పెంచడం. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్స్ పెద్దగా మేజిక్ చేయలేకపోయాయి. ఒక పాటలో బూతులు ఎక్కువయ్యాయంటూ విమర్శలు కూడా వచ్చాయి.
దర్శకుడు భాను భోగవరపుకి ఇది మొదటి సినిమా. స్టార్ రైటర్ గా ఇండస్ట్రీలో పేరుంది కానీ డెబ్యూ కాబట్టి డైరెక్టర్ గా తన మీద ఒత్తిడి చాలానే ఉంటుంది. అందులోనూ అంచనాల పరంగా ఇప్పటిదాకా మాస్ జాతర ఎలాంటి సౌండ్ చేయలేదు. రవితేజ ఎనర్జీ ప్రమోషన్ మెటీరియల్ లో కనిపిస్తోంది కానీ ఇది రొటీన్ స్టోరీనేమోననే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే ఎలివేషన్, టెంపో సరైన మోతాదులో ఉంటే హిట్టవ్వొచ్చని ఇటీవలే ఓజి నిరూపించింది. తెలిసిన కథనే దర్శకుడు సుజిత్ హ్యాండిల్ చేసిన విధానం మాస్ కి నచ్చేసింది. ఇప్పుడు భాను భోగవరపు కూడా అదే తరహాలో మెప్పించాల్సి ఉంటుంది.
అసలే రవితేజకు వరస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య తప్ప గత రెండేళ్లలో మాస్ మహారాజాకు సక్సెస్ లేదు. ప్రయోగాలు పోయాయి. రెగ్యులర్ ఫార్ములాలూ పని చేయలేదు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సైతం హిట్టు కోసం తపిస్తున్నారు. కింగ్ డమ్ డిజాస్టర్, వార్ 2 డిస్ట్రిబ్యూషన్ రెండూ నష్టాలు తెచ్చి పెట్టాయి. కోలుకోవడానికి ఛాన్స్ ఇవ్వాల్సింది మాస్ జాతరే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఫ్యాన్స్ ఆకలి తీరుతుందనే నమ్మకం టీమ్ వ్యక్తం చేస్తోంది.