టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్ రాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత స్ఫూర్తిదాయక ఎదుగుదల రవితేజదే. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, కిక్ సహా ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి రవితేజ కెరీర్లో. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా.. ఈ మూడు తప్పితే గత పదేళ్లలో రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్లే అయ్యాయి.
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా రెండేళ్లలో నాలుగు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న మాస్ రాజా.. తాజాగా ‘మాస్ జాతర’తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా కూడా ఆయన ఆశలను నిలబెట్టలేదు. గత చిత్రాల కంటే దారుణమైన ఫలితాన్నందుకుంది. వీకెండ్లో కూడా సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన ‘మాస్ జాతర’.. సోమవారం నుంచి పూర్తిగా వాషౌట్ అయిపోయింది.
‘ఈగల్’ లాంటి డిఫరెంట్ సినిమాలు తీస్తే ఫలితం ఉండట్లేదని.. తన మార్కు మాస్ సినిమాలు ట్రై చేసినా రవితేజకు అస్సలు కలిసి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రవితేజ దృష్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీదికి మళ్లింది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి మంచి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సైలెంటుగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇది రవితేజ ఇమేజ్కు కొంచెం భిన్నమైన సినిమానే.
ఇది కొత్త రకం సినిమా అని చెప్పలేం కానీ.. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రవితేజను చూడడం మాత్రం కొత్తే. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్న కిషోర్ తిరుమల.. బాగా టైం తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. తనకూ పెద్ద హిట్ అవసరమైన స్థితిలో రవితేజకూ అతను ఓ మంచి విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి షెడ్యూల్ చేశారు కానీ.. అప్పుడు రావడం డౌటే అంటున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమా రిలీజ్ కావచ్చు. ఎప్పుడు వచ్చినా ఈ చిత్రంతో రవితేజ హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోతుంది.