తొలి భాగంకి ధీటుగా సీక్వెల్స్ హిట్టయిన ట్రాక్ రికార్డు అన్ని సినిమాలకు రాదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ పార్ట్ టూలు తెచ్చిన బ్లాక్ బస్టర్ వసూళ్లు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు వీటి సరసన కాంతార చేరింది. చాప్టర్ 1 ఏ లెజెండ్ పేరుతో వచ్చిన ప్రీక్వెల్ అంచనాలకు మించి 500 కోట్ల వైపు పరుగులు పెట్టడం చూస్తున్నాం. సహస్రం అనుమానంగానే ఉంది కానీ దీపావళి దాకా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఆ అవకాశాన్ని రిషబ్ శెట్టి టీమ్ పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. ఇక శాండల్ వుడ్ ఫ్యాన్స్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ కాంతార చాప్టర్ 2 వీలైనంత త్వరగా మొదలుపెట్టమని. ఇక్కడే ఉంది ట్విస్టు.
రిషబ్ శెట్టి ప్రస్తుతం మూడు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ వాటిలో మొదటిది. ఎప్పటి నుంచి సెట్స్ కు వెళ్తుందనేది ఇంకా చెప్పలేదు కానీ ఇంటర్వ్యూలలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకొద్ది నెలల్లో అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోది సితార ఎంటర్ టైన్మెంట్స్ లో రూపొందబోయే పీరియాడిక్ డ్రామా. స్క్రిప్ట్ రెడీగా ఉంది. అశ్విన్ గంగరాజు దర్శకుడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరొకటి ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా రూపొందబోయే బాలీవుడ్ మూవీ. ఇవన్నీ పూర్తి కావడానికి ఎంతలేదన్నా అయిదారు సంవత్సరాలు పట్టడం ఖాయం.
అలాంటప్పుడు కాంతార చాప్టర్ 2కి ఇప్పట్లో ఛాన్స్ లేదు. రిషబ్ శెట్టి ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతల గురించి విరామం తీసుకుని కేవలం నటనకే పరిమితం కావాలని చూస్తున్నాడట. మూడో భాగానికి హోంబాలే ఫిలిమ్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ తను టేకప్ చేసే పరిస్థితిలో లేడు. సో పంజుర్లి భక్తులకు లాంగ్ వెయిటింగ్ తప్పదు. అయితే థర్డ్ పార్ట్ కి ఐడియా ఉన్నా ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ మెంట్ లేదట. పోలికలు రాకుండా పూర్తిగా కొత్త కథను రాసుకోవాలనే ఆలోచనలో ఉన్న రిషబ్ శెట్టి ఎక్కువ గ్యాపే తీసుకునేలా ఉన్నాడు. కెజిఎఫ్ 3, సలార్ 2 వచ్చాకే కాంతార 3 ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మూడు ఒకే నిర్మాణ సంస్థవి కాబట్టి.