ఏపీలోని మారేడుమిల్లిలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు. మెరుపు దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. ఆయనది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామం. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో హిడ్మాకు పట్టు ఉంది. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్ మైండ్. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా హిడ్మా మారాడు. హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డ్, హిడ్మా భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ఆయన భార్య కూడా మరణించింది.
పూర్తి పేరు మడివి హిడ్మా.. ఆయన మొత్తం 26 దాడుల్లో కీలక నిందితుడు. 2007 లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చాడు. 2010 లో తడ్మెట్ల మెరుపుదాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013 లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత కోశారు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2021 ఏప్రిల్ 4 వ తేదీన బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి చెందారు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్కి ముందు.. ఆయన్ను పట్టుకోవడానికి చత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఇటీవల మావోయిస్టుల కంచుకోట సుక్మా జిల్లా, పూవర్తి గ్రామంలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా హిడ్మా తల్లితో కలిసి భోజనం చేసిన విజయ్ శర్మ.. హిడ్మా లొంగుబాటుకి కృషి చేయాలంటూ అభ్యర్ధించారు. వీలైనంత త్వరగా హిడ్మా లొంగుబాటుకి కృషి చేయాలని కోరగా.. అందుకు కృషి చేస్తానని హిడ్మా తల్లి సానుకూల స్పందించారు. నవంబర్ 10న భారీ బందోబస్తు నడుమ విజయ్ శర్మ పర్యటించారు. సరిగ్గా 8 రోజుల (నవంబర్ 18న) తర్వాత.. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజక్క మృతి చెందారు.