స్టార్ హీరోల ఈవెంట్లలో అభిమానులు ఎంత హడావుడి చేస్తారో టాలీవుడ్ సినిమా ఈవెంట్లు చూసే వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమ అభిమాన హీరో హీరోయిన్లను చూసినపుడు ఉత్సాహం కట్టలు తెంచుకుని కొంత హడావుడి చేయడం వరకు ఓకే. కానీ సందర్భం చూడకుండా.. అతిథులు మాట్లాడుతున్నపుడు అదే పనిగా నినాదాలు చేయడం.. ప్రసంగాలకు అడ్డుతగలడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇదొక మేనియాలా మారి.. ఎంత ఎక్కువ హంగామా చేస్తే ఆ హీరోకు అంత ఫాలోయింగ్ ఉన్నట్లు.. ఆ ఫ్యాన్స్ అంత గ్రేట్ అన్నట్లుగా అందరు అభిమానులూ ఇలాగే తయారవుతున్న పరిస్థితి. స్టార్ హీరోలు స్వయంగా వారిస్తున్నా సరే.. ఫ్యాన్స్ ఈ విషయంలో తగ్గట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తరచుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ మీద కోపాన్ని దాచుకోకుండా బయటపెట్టేస్తున్నాడు జూనియర్.
గత ఏడాది ‘వార్-2’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో హృతిక్తో పాటు ఇతర అతిథులు మాట్లాడుతున్నపుడు ఫ్యాన్స్ పదే పదే తన పేరును ఉచ్ఛరిస్తూ అడ్డుతగలడంతో తారక్ ఫ్రస్టేట్ అయ్యాడు. అభిమానులకు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ఆరంభోత్సవం సందర్భంగానూ తారక్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతున్నపుడు.. అభిమానులు అదే పనిగా తారక్ తారక్ అంటూ నినాదాలు చేయడంతో జూనియర్కు కోపం వచ్చింది. దీంతో ‘క్వయిట్ క్వయిట్’ అంటూ చాలా సీరియస్గా అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో అందరూ సైలెంట్ అయ్యారు. తాను ప్రతిసారీ వారిస్తున్నా అభిమానులు కంట్రోల్ కాకపోవడం తారక్కు బాగా కోపం తెప్పిస్తున్నట్లే ఉంది. తాజా అనుభవం తర్వాత అయినా అభిమానులు మారాల్సిన అవసరముంది. మిగతా ఫ్యాన్స్ సైతం ఈ అనవసర హంగామాకు తెరదించాల్సిన అవసరముంది.
బాబు కొంచెం Silent గా ఉంటారా…Quiet.. Quiet… Quiet pic.twitter.com/dlet1XIegC— Gulte (@GulteOfficial) March 8, 2026