హైదరాబాద్ : నేటి స్పీడ్ యుగంలో యువత ఒత్తిళ్లను అధిగమించాలంటే ముందు ఆరోగ్యం, నైతిక విలువలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో యువ భారత్ రన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద భారీ రన్ చేపట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , పల్లవి స్కూల్స్ యజమాని, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది . ఈ రన్లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.రన్తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు.
The post యువత ఆరోగ్యంతో పాటు విలువలపై దృష్టి పెట్టాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
యువత ఆరోగ్యంతో పాటు విలువలపై దృష్టి పెట్టాలి
Categories: