తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అక్టోబరు 9(నేటి నుంచి 8 రోజుల్లో)న నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా ఐదు దశల్లో నవంబరు వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా.. కీలకమైన బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఎక్కడికక్కడ ప్రస్తుతం బీసీలకు రిజర్వేషన్ వ్యవహారమే చర్చగా మారింది.దీనిపై ఎటూ తేల్చలేక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అమలు చేయాలని పేర్కొంటూ జీవో ఇచ్చారు.. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది.
మరోవైపు.. కేవలం వారంలోనే అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు.. ముఖ్యంగా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం అర్థరాత్రి వరకు హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయ్యారు. ఎలా ముందుకు సాగాలి? రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి? అనే కీలక విషయంపై వారు చర్చోపచర్చలు జరిపారు. ఈ సమావేశానికి.. మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి సహా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పలువురు ఎమ్మెల్యేలతో పాటు వి.హనుమంతరావు(వీహెచ్) పాల్గొన్నారు.
ఈ క్రమంలో నాయకులు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలను ఇలానే కొనసాగించేయాలని పేర్కొన్నారు. అయితే.. హనుమంతరావు మాత్రం బీఆర్ఎస్, బీజేపీలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో నిర్ణయాత్మక ధోరణితోనే ఉన్నారని.. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని చెప్పారని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో తమిళనాడులోనూ ఇదే తరహాలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర బిల్లు పెండింగులో ఉందని.. మూడు మాసాల్లోగా.. నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కానీ, బిల్లుకు రెండు మాసాలు కూడా పూర్తికాలేదని.. వీహెచ్ అన్నారు.
ఇతర మంత్రులు మాట్లాడుతూ.. ప్రజల నుంచే బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం రూపంలో స్పందించేలా చేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీల దాడుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని సూచించారు. దీనిపై మంత్రి పొన్నం స్పందిస్తూ.. అలా ఇప్పటి వరకు చేశాం కాబట్టే.. వారు మౌనంగా ఉన్నారని.. మింగలేక.. కక్కలే ఇబ్బంది పడుతున్నారని కోర్టులను ఆశ్రయించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మిగిలిన వారు సూచించారు. దీంతో సమావేశం సుదీర్ఘంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు జరిగిన సమావేశం వివరాలను సీఎం రేవంత్ కు వివరించిన తర్వాత.. బుధ, గురువారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావించారు.