టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ తాజాగా మరోసారి.. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఎవరినీ వదిలేది లేదని.. రెడ్ బుక్లో చాలా పేజీలు ఉన్నాయని.. కేవలం మూడు పేజీలు మాత్రమే తెరిచామని చెప్పారు. ఇంకా తెరవాల్సిన పేజీలను తెరిస్తే.. అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయని పార్టీ కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. ఇది పార్టీ కార్యకర్తలను కేవలం ఉత్సాహ పరిచేందుకు చెప్పిన మాటగా తీసుకోలేం. వాస్తవానికి ఇప్పటి వరకు నమోదైన కేసులు.. విచారణల్లో కీలక కేసులు లేవన్నది సుస్పష్టం.
అసెంబ్లీలో చంద్రబాబును వేధించిన వ్యవహారం.. ఇంకా తెరమీదికి రాలేదు. దీనిపై కేసులు నమోదు చేయాలని ఉన్నా.. ఇది అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కావడంతో స్పీకర్ అనుమతి తప్పని సరి. ఇది జరిగితే.. అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్న కొడాలి నానీ, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ వంటివారిపై కేసులు నమోదు అవుతాయన్న చర్చ ఉంది. వచ్చే సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించిన వారిపై కూడా కేసులు నమోదు కాలేదు.
ప్రస్తుతం అవి కూడా పరిశీలనలో ఉన్నాయి. అలాగే.. అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణలపై అప్పట్లో కేసులు పెట్టడం.. అవి వీగిపోవడం తెలిసిందే. అయితే.. ఆనాడు ఎవరు వీటిని ప్రోత్సహించారన్న విషయంపైనా ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీని చిట్ ఫండ్స్ పేరుతో కేసులు పెట్టించిన ఆనాటి ఎంపీ మార్గాని భరత్ను కూడా కార్నర్ చేయాలని టీడీపీలో డిమాండ్ ఉంది. దీంతో వారు తరచుగా ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారు.
తమపై ఆనాడు కేసులు పెట్టిన వారిని వదలొద్దని కూడా చెబుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్టుగా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. లోకేష్ చెప్పినట్టు మరోసారి రెడ్బుక్ తెరిస్తే.. ఖచ్చితంగా ఆయా వ్యక్తులచుట్టూ కేసులు చుట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను వేధించిన వారిని కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు. మొత్తంగా రెడ్బుక్ – 2.0 ప్రారంభిస్తే.. వైసీపీ నేతలకు మరోసారి ఇబ్బందులు తప్పవన్న చర్చ తెరమీదికి వచ్చింది.