రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులు రావడం కొత్త కాదు. గతంలోనూ అనేక మంది కుటుంబాల నుంచి వచ్చారు. కలివిడిగా రాజకీయాలు చేసుకున్న వారు ఉన్నారు. కానీ.. మారుతున్న కాలంలో గత పదిహేనేళ్లుగా ఈ కుటుంబ రాజకీయాలు కూడా మారుతున్నాయి. సొంత కుటుంబసభ్యులే నేతలకు చిక్కు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తండ్రిపై కొడుకులు, కొడుకులపై తండ్రులు కూడా పెత్తనం చేసిన రాజకీయాలు ఉన్నాయి. తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రల వివాదం తెరమీదకు వచ్చింది.
ఈ సందర్భంలో రాజకీయాల్లో ఉన్న మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబుల వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇతర కుటుంబ రాజకీయాలకు భిన్నంగా, ఈ ఇద్దరు 2014 నుంచి కలివిడిగా ప్రత్యక్ష రాజకీయాలు చేస్తుండడం, ఒకరిని ఒకరు ప్రోత్సహించడం, నారా లోకేష్కు దశ దిశ చూపించడంలో చంద్రబాబు ముందుండడం వంటివి చర్చకు వస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, నారా లోకేష్ ఢిల్లీ చుట్టూ తిరిగి.. తండ్రిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం కూడా తెలుసు.
ఇప్పుడు ఇద్దరూ అధికారిక హోదాల్లో ఏపీకోసం పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. లోకేష్ లాంటి కొడుకు, చంద్రబాబు వంటి తండ్రి రాజకీయాల్లో దొరకడం కష్టం అని పలు వర్గాలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో రాజకీయ వివాదాలు, విభేదాలు పెట్టుకుని దూరమైన తండ్రి-కొడుకులు, కూతుళ్ల వ్యవహారాలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు.
తమిళనాడులో దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పార్టీ కోసం తండ్రితో విభేదించారు. అనంతరం తండ్రిని చూసేందుకు కూడా రాలేదు. 2010-15 మధ్య కర్ణాటకలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో ఆయన చిన్న కుమారుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కుమారుడు స్వామి రోడ్డెక్కారు. తన తండ్రి స్థాపించిన పార్టీని తనదేనని ప్రకటించారు. ఇది చానాళ్లు వివాదంగా మారింది. తరువాత పదేళ్లకు మళ్లీ కలిశారు.
తదుపరి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎందుకు తండ్రిని విభేదించారో, ఎందుకు పార్టీకి దూరమయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే తండ్రి కడుపున పుట్టిన షర్మిల, జగన్ల రాజకీయాలు కూడా అందరికీ తెలుసు.
పోలిస్తే, తండ్రి-కొడుకుల రాజకీయాల్లో నారా లోకేష్-చంద్రబాబులు ఎంత కలివిడిగా ఉన్నారో సోషల్ మీడియా జనం చర్చిస్తూనే ఉన్నారు.