ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ జూనియర్ ఎన్టీఆర్.. ‘టెంపర్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత నందమూరి హీరో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ‘టెంపర్’ నుంచి అతడి కెరీర్ ఫెయిల్యూర్ లేకుండా సాగిపోయింది. నాన్నకు ప్రేమతో, జై లవకుశ లాంటి చిత్రాలు అంచనాలకు తగ్గ వసూళ్లు సాధించలేదు కానీ.. వాటిని ఫెయిల్యూర్లు అని మాత్రం చెప్పలేం.
జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర.. సినిమాలు అభిమానులకు అమితానందాన్ని ఇచ్చాయి. గత ఏడాది ‘దేవర’ మిక్స్డ్ టాక్ను కూడా తట్టుకుని పెద్ద హిట్టే అయింది. దీని తర్వాత తారక్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ చేయడంతో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అది కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి ‘వార్’ మూవీకి సీక్వెల్ కావడం.. హృతిక్ రోషన్తో జట్టు కట్టడంతో తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనుకున్నారు.
కానీ ‘వార్-2’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తారక్కు ఎంతో సన్నిహితుడైన నిర్మాత నాగవంశీ.. ‘వార్-2’ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన ఏకంగా రూ.80 కోట్లు పెట్టి ఏపీ, తెలంగాణ రైట్స్ తీసుకుంటే.. అందులో సగం కూడా వెనక్కి రాలేదని.. ఈ సినిమా వల్ల ఆయన మునిగిపోయాడని.. ఆస్తులమ్ముకునే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరిగింది. తాజాగా వార్-2 రైట్స్, కలెక్షన్లు, నష్టాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగవంశీ.
‘‘వార్-2ను అంతకు కొన్నానని, ఇంత నష్టపోయానని ఏవేవో రూమర్లు వచ్చాయి. నిజానికి వార్-2 సినిమాను నేను కొన్నది జీఎస్టీ కాకుండా రూ.68 కోట్లకు. యశ్ రాజ్ వాళ్లు రిలీజ్కు ముందే జీఎస్టీ ఇచ్చేశారు. ఈ సినిమా రూ.35-40 కోట్ల మధ్య షేర్ చేసింది. రిలీజ్ తర్వాత సినిమాకు నష్టం వచ్చిందని.. పాపం యశ్ రాజ్ వాళ్లే పిలిచి మరీ నాకు రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చారు.
ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారమే నష్టం భర్తీ చేశారు. ఇలా చూసుకుంటే నేను నష్టపోయింది చాలా తక్కువ’’ అని నాగవంశీ స్పష్టం చేశాడు. నిర్మాత చెబుతున్న లెక్కల ప్రకారం ‘వార్-2’ నష్టం రూ.10-15 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.