విమాన ప్రయాణం అంటేనే ఇప్పుడు టెన్షన్ గా మారుతోంది. ఎయిర్బస్ A320 విమానాల్లో వచ్చిన ఒక సాఫ్ట్వేర్ సమస్య ఇప్పుడు భారత విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 350 విమానాలపై దీని ప్రభావం పడింది. దీంతో చాలా ఫ్లైట్స్ ఆలస్యమవుతున్నాయి, కొన్ని రద్దవుతున్నాయి. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం టెక్నికల్ గ్లిచ్ అని డీజీసీఏ (DGCA) అఫీషియల్గా చెప్పేసింది.
అసలు ఈ గొడవంతా ఎందుకు మొదలైందంటే.. మొన్న అక్టోబర్లో జెట్బ్లూ అనే విమానం గాలిలో ఉండగానే సడెన్గా అదుపు తప్పి కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు కూడా. విచారణలో దీనికి కారణం ‘ఎలివేటర్ ఐలారాన్ కంప్యూటర్’ (ELAC) అనే సిస్టమ్లో లోపమని తేలింది. ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో, ఎయిర్బస్ సంస్థ అర్జెంట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్లైన్స్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మన దేశంలో ఈ ఎయిర్బస్ A320 సిరీస్ విమానాలను ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్కువగా వాడుతున్నాయి. డీజీసీఏ లెక్కల ప్రకారం ఇండియాలో మొత్తం 338 విమానాల్లో ఈ లోపం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇండిగోకు చెందినవే ఏకంగా 200 విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియావి 113, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్వి 25 ఉన్నాయి. అంటే మన దగ్గర తిరిగే చాలా విమానాలు ఇప్పుడు అప్డేట్ కోసం క్యూలో ఉన్నాయన్నమాట.
ప్రయాణికుల భద్రత ముఖ్యం కాబట్టి డీజీసీఏ దీన్ని సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 55 శాతం విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయిందని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని బేస్లలో ఈ రిపేర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన విమానాలను కూడా సాధ్యమైనంత త్వరగా అప్డేట్ చేసి, సేఫ్గా గాల్లోకి పంపాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ల వల్ల ఫ్లైట్ షెడ్యూల్స్ మారిపోతున్నాయి. అందుకే ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రయాణికులకు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందే మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సేఫ్టీ కోసం జరుగుతున్న ఈ ప్రక్రియ వల్ల కొద్దిరోజులు ఈ తిప్పలు తప్పవని ఎయిర్లైన్స్ చెబుతున్నాయి.