టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ పిల్లల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. ఇటీవలే తనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబమంతా తరలివచ్చి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న జంటను ఆశీర్వదించింది. ఈ ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐతే శిరీష్కు నయనిక ఎలా పరిచయం.. ఆమె నేపథ్యం ఏంటి.. వీరి ప్రేమ ఎలా మొదలైంది అని సోషల్ మీడియాలో జనాలు వెతికేస్తున్నారు. వివరంగా కాకపోయినా.. బ్రీఫ్గా నయనికతో తమ ప్రేమ గురించి సమాచారం ఇచ్చాడు శిరీష్. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా అతను ఈ సీక్రెట్ బయటపెట్టేశాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట.
ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు. ఏదో ఒక రోజు తమ పిల్లలు తమ ప్రేమ గురించి అడుగుతారని.. ఆ రోజు ఇదే చెబుతానని శిరీష్ తెలిపాడు. తనను తమ ఫ్రెండ్స్ సర్కిల్ లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ శిరీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు. శిరీష్-నయనికల పెళ్లి ఫిబ్రవరిలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.