ఎన్నడూ లేనిది రాజమౌళి టీమ్ హఠాత్తుగా షాకులు ఇస్తోంది. మొన్న విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ కేవలం కొన్ని గంటల ముందు ప్రకటించి రివీల్ చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. పెద్ది నుంచి వచ్చిన చికిరి చికిరి హడావిడిలో ఇది కొంచెం వెనుకబడి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ లేకపోతే వేరే స్థాయిలో స్పందన ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అసలే సౌండ్ లేకుండా తాజాగా మొదటి లిరికల్ సాంగ్ పలు మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చేసింది. అది కూడా టైటిల్ సాంగ్ కావడం మరో ట్విస్టు. చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చగా శృతి హాసన్ గాత్రం అందించడం విశేషం.
ఎక్కువ బీట్స్ లేకుండా సీరియస్ గా సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ ‘సంచారి మృత్వువుపై తన స్వారీ’ అంటూ దేనికైనా తెగించే తత్వాన్ని పదాల్లో కూర్చారు. హై అండ్ లోస్ బ్యాలన్స్ చేస్తూ కీరవాణి వాడిన ఇన్స్ ట్రుమెంటేషన్ మెల్లగా స్లో పాయిజన్ లా ఎక్కడం ఖాయం. గతంలో ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ సాంగ్ వచ్చినప్పుడు కూడా తొలుత ఇదేంటి ఇలా ఉందనుకున్నారు. తర్వాత అదే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడీ సంహరి కూడా అదే క్యాటగిరీలో చేరడం ఖాయం. గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకున్న కీరవాణి దానికి తగ్గట్టే అన్ని భాషలకు సెట్టయ్యే యునివర్సల్ అప్పీల్ ఉండేలా చూసుకున్నారు.
ఇది ఈ ప్యాన్ ఇండియా మూవీ పాటేనని శృతి హాసన్ కన్ఫర్మ్ చేసింది. కీరవాణి పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండటంతో రీచ్ తక్కువగా ఉంది. ఇంకా అఫీషియల్ హ్యాండిల్స్ లో పెట్టాల్సి ఉంది. స్పాటిఫై లాంటి ఆన్ లైన్ వేదికల్లో పెట్టేయడంతో ఫ్యాన్స్ వాటి వైపు వెళ్లిపోతున్నారు. మరి రాజమౌళి ఇంత సడన్ గా ట్విస్టు ఎందుకు ఇచ్చారు, ఇది నవంబర్ 15 లాంచ్ చేయబోయే ఈవెంట్ లో పాటేనా లేక అక్కడ వేరే కంటెంట్ ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకటి మాత్రం వాస్తవం. ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఏదీ ఎక్స్ పెక్ట్ చేసినట్టు జరగడం లేదు. అన్నీ సర్ప్రైజులే.