సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేయడం చూశాం. మొదట తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు నిర్వహించిన రోజా కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపించేవారు. జబర్దస్త్ కామెడీ షో జడ్జ్ గా అక్కడ సుదీర్ఘ కాలం కెరీర్ చవి చూశారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల విమర్శలు రావడంతో మానేశారు. గత ఎన్నికల్లో నగరి నుంచి ఓటమి చవి చూశాక ఈ మధ్య మళ్ళీ రియాలిటీ షోలలో అతిధిగా కనిపిస్తున్నారు. తాజాగా సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు.
తమిళంలో రూపొందుతున్న లెనిన్ ఇండియన్ అనే మూవీ ద్వారా రోజా పునఃప్రవేశం చేయబోతున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంతానం అనే పాత్ర ద్వారా రోజాని కొత్తగా చూపించబోతున్నట్టు తెలిసింది. వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్స్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. రోజా చివరిసారి సినిమాల్లో నటించింది 2013లో. డాటర్ అఫ్ వర్మ అనే చిన్న చిత్రంలో నటించినా అది జనాలకు గుర్తు లేనంతగా ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు కాస్త చెప్పుకోదగిన క్యారెక్టర్లు శ్రీరామ రాజ్యం, వీర లాంటి వాటిలో చేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ రోజా ఇకపై తెలుగులోనూ నటిస్తారా, ఒకవేళ సిద్ధంగా ఉంటే ఎలాంటి అవకాశాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రోజా ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీనే. ఏపీ రూలింగ్ పార్టీ టిడిపి మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను తరచుగా కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అలాంటప్పుడు వాళ్లకు సన్నిహితంగా ఉండే టాలీవుడ్ దర్శక నిర్మాతలు రోజాకు అవకాశాలు ఇవ్వడం అనుమానమేనని విశ్లేషకుల మాట. విజయశాంతి లాగా సెలెక్టివ్ గా నటించాలనుకుంటే మాత్రం రోజాని రెగ్యులర్ గా సినిమాల్లో చూడలేం.