స్త్రీ శక్తి అంటే నాకు మొదటి గుర్తు వచ్చే మొదటి పేరు నిర్మలా సేతారామన్. ఇప్పుడు ఆవిడ ఎంత ప్రశాంతంగా ఉన్నారో.. పార్లమెంట్ లో పూర్తి భిన్నంగా ప్రతిపక్ష నాయకులకు చుక్కలు చూపిస్తారు. మహిళలు ఎలా ఉండాలో ఆమెను చూస్తే అర్థమవుతుంది. ఆవిడ రికార్డులు ఎవరు బద్దలు కొట్టలేరు..అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక మంది మహిళలు ఆర్దికశాఖ మంత్రులుగా ఉన్నారు. కానీ మన నిర్మలా సేతారామన్ అందరి రికార్డులు బద్దలు కొట్టారు. వరుసగా 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆవిడ జీవితం మనకి ఒకపాఠం అని తెలిపారు.
లండన్ లో హెబిటేట్ అనే ఒక గృహాలంకరణ దుకాణంలో ఆమె ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారు. 2008 లో బిజెపిలో చేరి అధికార ప్రతినిధి గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయ్యారు, ఆ తర్వాత కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అయ్యారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా ప్రకటిస్తుంది. అందుల నిర్మలా సేతారామన్ వరుసగా 6 సార్లు శక్తివంతమైన మహిళలు గా నిలబడ్డారని గుర్తు చేశారు.
ఎంత ఎదిగినా సింపుల్ గా ఉండటం మేడమ్ ను చూసి నేర్చుకున్నాను. చేనేత చీరల్ని ప్రమోట్ చేస్తారు. అనేకసార్లు మంగళగిరి చీరలు కూడా ప్రమోట్ చేశారు. అందుకు మేడమ్ కి మంగళగిరి చేనేతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే జిఎస్ టి 2.0 సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి ఎప్పుడు కలిసి రాష్ట్రానికి సాయం చెయ్యాలని కోరినా వెంటనే స్పందించే అండగా నిలిచారని అన్నారు. ఆగిపోయిన అమరావతి పనులను సరైన దారిలోపెట్టి అవసరమైన ఆర్థికవనరులు అందించారు అని తెలిపారు.
పోలవరాన్ని గతంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి, కాఫర్ డ్యామ్, ఇతర ముఖ్యమైన కాంపొనెంట్స్ ని దెబ్బతీస్తే… ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసి సరైన దారిలో పెట్టారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అర్థరాత్రి 12గంటల సమయంలో ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయించి స్టీల్ ప్లాంట్ ను సరైన దారిలో పెట్టారని కొనియాడారు. ఈరోజు ప్రపంచమంతా విశాఖవైపు చూస్తోంది, దానికి కారణంగా భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్టిమెంట్. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గూగుల్ విశాఖకు రావడానికి అండగా నిలబడి అవసరమైన భరోసా అందించారు. ఆమె అండగా నిలవడం వల్లే అనుకున్న పనులు చేయగలుగుతున్నాం అని మంత్రి లోకేష్ వివరించారు.