అంతా అనుకున్నట్లు జరిగితే భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లయిపోయి ఈపాటికి నాలుగు రోజులు అయ్యుండాలి. కానీ ఆదివారం మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. హఠాత్తుగా వేడుకలు ఆగిపోయాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యారని.. అందుకే పెళ్లి ఆగిందని.. ఆయన కోలుకున్నాక వివాహం జరుగుతుందని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ తర్వాతి రోజు నుంచి కథ కొత్త మలుపు తిరిగింది.
పెళ్లి ఆగడానికి శ్రీనివాస్ అనారోగ్యం మాత్రమే కారణం కాదని.. దీనికి వేరే కారణాలున్నాయని రూమర్లు మొదలయ్యాయి. స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్కు వేరే అమ్మాయితో సంబంధముందని.. అది బయటపడడంతోనే పెళ్లి ఆగిందని.. ఈ వివాహం జరగదని గుసగుసలు వినిపించాయి. ముందు ఇవి కట్టుకథలనే భావించారు ఎక్కువమంది. కానీ రోజులు గడిచేకొద్దీ ఈ అనుమానాలు బలపడ్డాయి. రకరకాల స్టోరీలు బయటికి వచ్చాయి. మరోవైపు స్మృతి మంధాన తన ఇన్స్టాలో పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డెలీట్ చేయడంతో ఏదో తేడా జరుగుతోందనే విషయం అందరికీ అర్థమైంది.
శ్రీనివాస్ ఆసుపత్రి నుంచి బయటికి వస్తే ఒక క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. బుధవారం ఆయన డిశ్చార్జ్ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది. అయినా స్మృతి పెళ్లి వ్యవహారంపై సస్పెన్సు వీడలేదు. సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు నడుస్తున్నా.. వాటికి తెరదించే ప్రయత్నం స్మృతి కానీ, పలాష్ కానీ చేయట్లేదు. తన పెళ్లి ఆగిపోవడంపై వస్తున్న రూమర్ల గురించి స్మృతికి తెలియదు అనుకోవడానికి లేదు. కచ్చితంగా ఆమెకు సమాచారం ఉండే ఉంటుంది. అయినా ఆ పుకార్లకు తెరదించే ప్రయత్నం ఆమె ఎందుకు చేయట్లేదన్న ఇప్పుడు ప్రశ్న.
తండ్రి ఆసుపత్రిలో ఉన్నంత వరకు ఓకే కానీ.. ఆయన డిశ్చార్జి అయ్యాక అయినా.. స్మృతి స్పందించాలి కదా. పలాష్తో పెళ్లికి రెడీగానే ఉన్నట్లయితే, త్వరలో ఈ వేడుక జరిగేట్లయితే.. అతడి ఇమేజ్ అంతగా డ్యామేజ్ అవుతుంటే చూస్తూ ఆమె ఎలా ఊరుకోగలదుదు? ఆ ప్రచారం నిజం కాదని చెప్పాలి కదా. కానీ స్మృతి మౌనాన్నే ఆశ్రయిస్తోందంటే.. ఎక్కడో ఏదో తేడా ఉందనే అర్థం. పెళ్లి గురించి స్మృతి పునరాలోచిస్తూ ఉండాలి.. లేదా వివాహం వద్దు అని నిర్ణయించుకుని ఉండాలి. మరి రాబోయే రోజుల్లో అయినా స్మృతి నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.