hyderabadupdates.com movies హనుమాన్ దర్శకుడి మౌనం బద్దలయ్యేనా

హనుమాన్ దర్శకుడి మౌనం బద్దలయ్యేనా

దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఎవరికీ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో సరైన క్లారిటీ ఇవ్వడం లేదని, దీంతో నిర్మాతలు ఆయన మీద మహా గుస్సాగా ఉన్నారని రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. హనుమాన్ వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఇప్పటిదాకా తన డైరెక్షన్ లో కొత్త మూవీ ప్రారంభం కానేలేదు. రన్బీర్ సింగ్, మోక్షజ్ఞతో వేర్వేరుగా ప్లాన్ చేసుకున్న సినిమాలు అర్ధాంతరంగా రద్దు కావడం తన మీద ప్రభావం చూపించింది. జై హనుమాన్, ప్రభాస్ తో మూవీ గురించి ఇప్పటికీ క్లారిటీ లేక ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ ప్రచారానికి చెక్ పడాలంటే ప్రశాంత్ వర్మ మౌనం బద్దలవ్వాల్సిందే. ఈ మధ్య తను బయట ఈవెంట్లలో పెద్దగా కనిపించడం లేదు. స్వంతంగా స్టూడియో కం ఆఫీస్ సెటప్ చేసుకున్నాక ఎక్కువ శాతం సమయం అక్కడే గడిపేస్తున్నారు. తన పర్యవేక్షణలో రూపొందుతున్న పిసియు యూనివర్స్ సినిమాల పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. వాటిలో మాకాళి అప్డేట్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. జై హనుమాన్ నా నెక్స్ట్ మూవీ అని రిషబ్ శెట్టి కాంతారా ఇంటర్వ్యూలలో చెప్పాడు కానీ ఫలానా టైం, డేట్ అని ఇటు ప్రశాంత్ వర్మ నుంచి అటు మైత్రి నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

వీలైనంత త్వరగా ప్రశాంత్ వర్మ సైలెన్స్ ని బ్రేక్ చేయడం అవసరం. పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉండొచ్చు గాక. కానీ అలాని ఏళ్ళ తరబడి సమయం వృథా చేసుకోవడం కరెక్ట్ కాదు. రాజమౌళి సైతం ఆలస్యం చేస్తారని ఆయన బాటలో వెళ్లడం భావ్యమనిపించుకోదు. హనుమాన్ ని మించిన సినిమా ఇచ్చే బాధ్యత ప్రశాంత్ వర్మ మీద ఉంది. తనతో ఇంకా అగ్ర హీరోలు చేతులు కలపలేదు. ప్రభాస్ సానుకూలంగా ఉన్నాడు కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఓపెనింగ్ చేస్తే తప్ప గ్యారెంటీ లేని పరిస్థితులు నెలకొన్నాయి. తాము అడ్వాన్సులు ఇవ్వలేదని ప్రొడక్షన్ హౌసులు చెప్పడం కన్నా అదేదో ప్రశాంత్ స్వయంగా కుండబద్దలు కొడితే బెటర్.

Related Post