తెలుగు వాడైన తమిళ హీరో విశాల్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి. ఐతే వాటిలో ఒక వివాదం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడాా వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మద్రాస్ హైకోర్టు.. విశాల్పై సీరియస్ అయింది. వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించింది. లేదంటే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరాలేంటో చూద్దాం.
కోలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెళియన్ గతంలో ఒక సినిమా కోసమని విశాల్కు రూ.21 కోట్ల రుణం ఇచ్చాడు. ఆ తర్వాత వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ఐతే ఇందుకు గాను విశాల్ నటించే సినిమాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇవ్వాలని లైకా షరతు విధించింది. కానీ విశాల్ అలా చేయలేదు. పైగా రుణాన్ని లైకాకు తిరిగి ఇవ్వలేదు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఇటీవల మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ ఈ కేసు విషయంలో లైకా సంస్థకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. రూ.21 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై విశాల్ అప్పీల్కు వెళ్లాడు. దీనిపై విచారణ సందర్భంగా.. తమ క్లైంట్ అంత డబ్బు కట్టేంత ధనవంతుడు కాదని విశాల్ లాయర్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. విశాల్ ధనవంతుడు కాకపోతే దివాళా తీసినట్లు ప్రకటిస్తారా అని పేర్కొంది. వెంటనే ఈ కేసుకు సంబంధించి రూ.10 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు విశాల్ను ఆదేశించింది.