hyderabadupdates.com movies 2026 – ఆ పార్టీకి అగ్నిప‌రీక్షే!

2026 – ఆ పార్టీకి అగ్నిప‌రీక్షే!

కొత్త సంవ‌త్స‌రం 2026 భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తోపాటు.. 72 రాజ్య‌స‌భ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు లోక్‌స‌భ‌లోనే బీజేపీకి ఆధిప‌త్యం ఉండ‌గా.. కాంగ్రెస్‌కు రాజ్య‌స‌భ‌లో బ‌ల‌మైన సంఖ్యాబ‌లం ఉంది.

అయితే.. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న 72 రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో(వీటిలో కొన్ని నామినేటెడ్ కూడా ఉన్నాయి)దాదాపు 60 స్థానాల వ‌ర‌కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి పార్టీలు ద‌క్కించుకుంటాయి. త‌ద్వారా.. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌కు ఉన్న బ‌లం త‌గ్గిపోనుంది.

ముఖ్యంగా 2025లో జ‌రిగిన‌ బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బ‌తింది. అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్ స‌హా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో అసెంబ్లీలో సంఖ్యా ప‌రంగా కాంగ్రెస్ దెబ్బ‌తింది. దీని ఆధారంగా జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌నుంది.

ఆయా రాష్ట్రాల‌కు కేటాయించిన రాజ్య‌స‌భ స్థానాలు బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్న పార్టీల‌కు ద‌క్క‌నున్నాయి. ఢిల్లీలో అయితే.. ఏకంగా బీజేపీకే ద‌క్క‌నున్నాయి. ఇక‌, ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన నేప‌థ్యంలో అక్క‌డ కూడా రాజ్య స‌భ స్థానాలు కాంగ్రెస్ చేజారిపోనున్నాయి.

ఇక‌, 2026లో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ బెంగాల్‌, అసోంల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాస్త‌వానికి ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక‌ప్పుడు బ‌లంగా ఉన్న‌(కేర‌ళ మిన‌హా) కాంగ్రెస్‌.. త‌ర్వాత కాలంలో రాను రాను జారుడు మెట్ల‌పై విన్యాసం చేయడం ప్రారంభించింది.

దీంతో గ‌త రెండు ద‌శాబ్దాల‌కు పైగా త‌మిళ‌నాడులో.. ద‌శాబ్ద‌కాలంగా అసోంలో కాంగ్రెస్ ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో అయితే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి.. 6 ద‌శాబ్దాలు అయింది. కేర‌ళ‌లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ క‌నీసం పుంజుకుంటుందా? అనేది ప్ర‌శ్న‌.

అంతేకాదు.. ప్ర‌స్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో(2025) పొత్తు పెట్టుకున్నా చావుదెబ్బ‌తిన్న నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీలు.. కాంగ్రెస్‌తో క‌లిసి ముందుకు వ‌చ్చేందుకు స‌సేమిరా అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మిత్ర‌ప‌క్షాలు ఉన్నా.. అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఒంట‌రిపోరుకే ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉంది.

2025లో జ‌రిగిన ఢిల్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు జాతీయ స్థాయి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. విడిపోయి.. ఒంటరిపోరు చేసింది. ఇలానే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు ఒంట‌రి పోరుకు దిగితే.. పురాత‌న 140 ఏళ్ల పార్టీ.. ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. 2026 కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్నిపరీక్షేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Post

Santhana Prapthirasthu Trends on Jio Hotstar, Enters Amazon Prime Video Top 10Santhana Prapthirasthu Trends on Jio Hotstar, Enters Amazon Prime Video Top 10

The Telugu film Santhana Prapthirasthu is witnessing steady traction on OTT platforms following its digital release on December 19. After completing its theatrical run, the film has found a place