థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇవాళ బెంగళూరులో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంతో పాటు ఎక్కువ డిస్కషన్ కు వచ్చిన పాయింట్ ఇదేనట. బాలీవుడ్, మల్లువుడ్ తరహాలో దీన్ని కఠినంగా అమలు చేసే సాధ్యాసాధ్యాలు కూలంకుశంగా మాట్లాడుకున్నారట.
వాస్తవిక కోణంలో దీన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేయగలరా లేక ఊరికే రెండు మూడు వారాలు హడావిడి చేసి వదిలేస్తారా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టాలీవుడ్ లో మూడు నాలుగు అగ్ర నిర్మాణ సంస్థలు నాలుగు వారాల విండో కండీషన్ మీదే తమ బడ్జెట్ లను రికవర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ గ్యాప్ ని రెట్టింపు చేస్తే వచ్చే ఆదాయం చాలా తగ్గిపోతుంది. థియేటర్లలో బొమ్మ ఫ్లాప్ అయితే నెత్తి మీద తడిగుడ్డ ఖాయం.
ఇంకోవైపు చిన్న సినిమాల కష్టాలు మరోలా ఉన్నాయి. నాలుగు వారాలు కాదు పదిహేను రోజులకే ఓటిటికి ఇచ్చినా ఆడియన్స్ ఎగబడి చూడటం లేదు. టాక్స్, రివ్యూలు అప్పటికే చదివేసి ఉండటంతో సమయం ఎందుకు వృథా చేయడమని ఆగిపోతున్నారు. బాగున్న వాటికి మాత్రమే ఆదరణ దక్కుతోంది. స్టార్ హీరోలకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది కానీ మిగిలినవాళ్లకు ఇది గుదిబండగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా రెండు నెలల తర్వాత డిజిటల్ అంటే ఆత్మహత్యా సదృశ్యమే.
అసలు అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకురావడం మండలి సభ్యులకు పెద్ద సవాలే. రకరకాల ప్రశ్నలు, వాదనలు తలెత్తుతాయి. వాటన్నింటికి సమాధానం చెప్పాలి. ఓ మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు కానీ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఈసారి అలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. పైరసీ మీద కూడా ఇంకా బలంగా పోరాడాలి. మరికొన్ని రోజుల్లో గైడ్ లైన్స్ రూపంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. చూద్దాం.