టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్.. ఈ నియోజకవర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్తగా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నియోకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం.. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలుసుకుంటున్నారు.
ప్రజలకు-తనకు మధ్య గ్యాప్లేకుండా, రాకుండా కూడా చూసుకుంటున్నారు. ఫలితంగా మంగళగిరిలో నారా లోకేష్ ప్రభావం.. ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆయన గ్రాఫ్ కూడా మరింత పుంజుకుంది. మరోవైపు వైసీపీ నాయకుల ప్రభావం లేకపోవడం.. అసలు ఆ పార్టీ తరఫున జెండా మోసేవారు కూడా లేకపోవడంతో టీడీపీనే ఇప్పుడు కనిపిస్తోంది. ఇది కూడా నారా లోకేష్కు కలిసి వచ్చింది. ఇక, ఇప్పుడు విశాఖలోనూ నారా లోకేష్ పేరు మార్మోగుతోంది. తాజాగా తెచ్చిన గూగుల్ ఏఐ డేటా కేంద్రంతో ఆయన పేరు వినిపిస్తోంది.
ఈ విషయంలో చంద్రబాబు కన్నా కూడా మంత్రి పేరు ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. అమెరికా చుట్టూ తిరిగి..గూగుల్ ప్రతినిధులను కలిసి.. వారిని ఒప్పించి ఈ ప్రాజెక్టు తీసుకువచ్చారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో టీడీపీ నాయకులు సక్సెస్ అయ్యారు. మంత్రి నారా లోకేష్.. ప్రయత్నాన్ని వారు ప్రజలకు వివరించారు. ఇది పార్టీకి ఎంతో కలిసి వస్తోంది. దీంతో పాటు వ్యక్తిగతంగా నారా లోకేష్ ఈ వ్యవహారం మరింత మేలు చేస్తోందనడంలో సందేహం లేదు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాజాగా టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు నారా లోకేష్ గ్రాఫ్ మా జిల్లాలో పెరిగిందని వ్యాఖ్యానించారు. సాధారణంగా.. గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటుతో చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుందని అనుకున్నామని.. ఆయనతోపాటు మంత్రి నారా లోకేష్ చేసిన కృషిని కూడా వివరించ డంలో సక్సెస్ అయ్యామని.. దీంతో నారా లోకేష్ గ్రాఫ్ కూడా మరింత పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే… మంత్రిగా నారా లోకేష్ తన గ్రాఫ్ను ఇంప్రూవ్ చేసుకోవడంలో ఏఐ పెట్టుబడి చాలా వరకు కలిసి వచ్చిందన్న మాట ఆయన చెప్పుకొచ్చారు.