ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్ ఎంగేజ్మెంట్ అజెండాలో ఏపీని చేర్చాలని కోరారు. ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలన్నారు. ‘‘ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఏపీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తదుపరి సీఈవోల ఫోరం సెషన్లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలి. ప్రాధాన్యతా రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను అక్కడ ప్రదర్శిస్తాం’’ అని తెలిపారు.
ఏపీకి మేలు చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టొద్దు – ప్రవాసాంధ్రులతో భేటీలో మంత్రి లోకేశ్
కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్… సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేశ్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లయినా.. 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైకాపా హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు.
‘‘చాలా రాష్ట్రాల్లో డబులింజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ.. ఏపీలో డబులింజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఒక్క జూమ్కాల్తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారు. పవన్కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నిరంగాల్లో రాష్ట్రం నంబర్ వన్గా ఉండేలా కృషి చేస్తోంది.
పోలవరం పనులు పూర్తిచేసి నీరందిస్తాం. రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ఆస్ట్రేలియా కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలి. మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశముంటే మాకు చెప్పండి.. అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు.. క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్తున్నా. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుంది’’ అని లోకేశ్ చెప్పారు.
The post Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్
Categories: